భారతీయ జనాతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బిహార్ బెగుసరాయ్లో ఏప్రిల్ 6వ తేదీన ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సురేంద్ర మెహతా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మంత్రి రావడంతో గ్రామస్థులు అంతా అక్కడకు వచ్చి సభను విజయవంతం చేశారు. ముఖ్యంగా మంత్రి సురేంద్ర మెహతా.. ఆ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి చాలా సేపు మాట్లాడారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి గురించి, ప్రజలకోసం తాము తీసుకు వచ్చిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
మొత్తంగా ఈ కార్యక్రమానికి 700 మంది రాగా.. వారందరికీ దుప్పట్లు పంపిణీ చేశారు. అయితే ఇదంతా జరిగింది మండుటెండలో. దుప్పట్లు తీసుకునేందుకు వచ్చిన గ్రామస్థులు చెమటలు కక్కుతూ.. తెగ ఆయాస పడిపోతూ కనిపించారు. కానీ దుప్పట్ల కోసం అదే ఎండలో క్యూ కట్టగా.. చాలా సేపటికి వాటిని అందుకుని ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఫేస్బుక్ వేదికగా షేర్ చేస్తూ మంత్రి సురేంద్ర మెహతా ఓ పోస్టు పెట్టారు. అందులో పేదల అభ్యున్నతి కోసం జాతి నిర్మాణం కోసం కట్టుబడి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేశామని రాసుకొచ్చారు.
40 డిగ్రీల సెల్సియస్ ఎండలోనూ దుప్పట్లు పంచడంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. పెద్ద ఎత్తున ఈ వీడియోపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో మంత్రి ఆ పోస్టును తొలగించారు. అయినా సరే నెటిజెన్లు, ప్రతిపక్షాలు ఈ వీడియోను వైరల్ చేస్తూనే ఉన్నారు. నిజంగా సాయం చేయాలనుకుంటే చలి కాలంలో దుప్పట్లు పంచాల్సి ఉండేదని.. కానీ ప్రజల్లో మంచి పేరు సంపాదించేందుకు ఇలాంటివి చేస్తే ఉన్న పరువు కూడా పోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. త్రిపుర కాంగ్రెస్ కార్యదర్శి సంజీవ్ భట్టాచార్య ఎక్స్ వేదికగా ఈ వీడియోను షేర్ చేస్తూ.. బిహార్ యువత కోసం కాంగ్రెస్ పార్టీ పలయన్ రోకో నౌక్రీ దో ప్రచారం ప్రారంభించిందని చెప్పారు.
ఈ కార్యక్రమంతో బీజేపీ నాయకుల్లో తీవ్ర అశాంతి మొదైలందని, ఓటమి భయంతో వారు కూడా ఏదో ఒకటి చేయాలనుకుని.. ఏమీ ఆలోచించకుండానే ఎండాకాలంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. మరో నెటిజెన్ అయితే ఇదెక్కడి మాస్ మావా.. మీకు యాళ్లాపాళ్లా లేదా అంటూ రాసుకొచ్చారు. బీజేపీ నాయకులు మాత్రమే ఇలాంటి పనులు చేయగల్గుతారని మరికొందరు వివరిస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్పై స్పందించిన మంత్రి సురేంద్ర మెహతా.. తాను పంపిణీ చేసిన దుప్పట్లు చాలా పలుచగా ఉన్నాయని, ఎండలో వాటిని కప్పుకుని వెళ్లొచ్చని సమర్థించుకోవడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa