ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు,,కలిసి పోరాడుదాం ,రండి... భారత్‌కు చైనా రిక్వెస్ట్

national |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 09:19 PM

చైనాపై వరుస సుంకాలతో వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ మరింత తీవ్రం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ టారిఫ్‌లపై పోరాటానికి చేతులు కలుపుదామని భారత్‌ను చైనా కోరింది. అమెరికా సుంకాలను అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు హాని కలిగించే దుర్వినియోగం'గా పేర్కొంది. అమెరికా'ఏకపక్ష విధానాలపై పోరాటానికి ప్రపంచ సహకారం అవసరమని పేర్కొంది. భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్.. భారత్-చైనా వాణిజ్య సంబంధాన్ని 'పరస్పర ప్రయోజనకరమైనది'గా అభివర్ణించారు. అమెరికా సుంకాలను దృష్టిలో ఉంచుకుని 'సవాళ్లను అధిగమించడానికి కలిసి నిలబడాలని భారత్‌ను కోరారు.


‘‘చైనా-భారత్ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనంపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల హక్కులను హరించేలా అమెరికా సుంకాలు విధిస్తోన్న నేపథ్యంలో రెండు అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు సవాళ్లను అధిగమించడానికి కలిసి నిలబడాలి’’ అని పేర్కొంది. ‘‘వాణిజ్య, సుంకాల యుద్ధాలలో విజేతలు ఉండరు. అన్ని దేశాలు విస్తృతమైన సంప్రదింపుల సూత్రాలను సమర్థించాలి.. బహుపాక్షికతను పాటించాలి.. ఏకపక్షవాదం, రక్షణవాదాన్ని సంయుక్తంగా వ్యతిరేకించాలి’’ అని విజ్ఞప్తి చేసింది. చైనాపై సుంకాలను పెంచుతామని అమెరికా బెదిరింపులకు పాల్పడిన తప్పుల మీద తప్పుచేస్తోందని వ్యాఖ్యానించింది. అమెరికా తన దారిలో ముందుకెళ్తే.. చివర వరకూ చైనా పోరాడుతుందని స్పష్టం చేసింది.


ఇదిలా ఉండగా, ట్రంప్ మంగళవారం చైనా వస్తువులపై అదనంగా 50 శాతం సుంకం విధించారు. దీంతో చైనాపై సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి. భారత్‌పై కూడా 26 శాతం సుంకాలు వేసిన విషయం తెలిసిందే. చైనాలో ఏప్రిల్ 2న 34 శాతం టారిఫ్‌లు విధించగా.. దీనికి బదులుగా చైనా అంతే స్థాయిలో ప్రతీకార సుంకాలు వేసింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. 24 గంటల్లో వాటిని ఉపసంహరించకుంటే.. 50 శాతం అదనంగా వేస్తామని హెచ్చరించారు. అయినా, చైనా ఈ బెదిరింపులకు లొంగకపోవడంతో నిజం చేశారు.


అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం గణాంకాల ప్రకారం..2024లో చైనా, అమెరికా వాణిజ్యం విలువ సుమారు 582.4 బిలియన్ల అమెరికా డాలర్లుగా అంచనా.2024లో చైనాకు అమెరికా వస్తువుల ఎగుమతులు 143.5 బిలియన్ల డాలర్లు.. చైనా నుంచి దిగుమతులు మొత్తం 438.9 బిలియన్ డాలర్లు. అంటే, చైనాతో పోల్చితే వాణిజ్య లోటు 295.4 బిలియన్ డాలర్లుగా ఉంది. పారిశ్రామిక, వ్యవసాయ వస్తువులు, ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చైనాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ తాజా సుంకాలు విధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa