ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే ఫార్మాపై భారీ సుంకాలు.. ట్రంప్

international |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 09:21 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. తాజాగా, చైనాపై అదనంగా 50 శాతం సుంకాలు విధించారు. ఈ యుద్ధాన్ని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. చైనాపై మరిన్ని ప్రతీకార సుంకాలు వడ్డించిన ట్రంప్.. త్వరలోనే ఫార్మాస్యూటికల్స్ దిగుమతులపై మోత మోగిస్తానని ప్రకటించారు. వాషింగ్టన్‌ త్వరలో ఔషధాల దిగుమతులపై భారీ ఎత్తున్న సుంకాలు విధించాలనే యోచిస్తోందని చెప్పారు. ట్రంప్ ప్రకటన అమెరికా వాణిజ్యంపై ఆధారపడిన దేశాల్లో ఒకటైన భారత్‌కు ఇబ్బందికరమైన పరిస్థితే. దేశీయ ఫార్మా రంగం గణనీయంగా ప్రభావితం కావచ్చు. ట్రంప్ సంకేతాలతో దేశీయ ఫార్మా షేర్లు భారీగా పతనమవుతున్నాయి.


మంగళవారం నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ సుంకాలు ఔషధ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికా నుంచి కొనసాగించేలా ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 2న ప్రకటించిన ప్రతీకార సుంకాల్లో ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లను మినహాయించిన విషయం తెలిసిందే.


భారత్‌పై ప్రభావం ఎంత?


భారత ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్. 2023- 24 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 27.9 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులలో 31 శాతం అంటే 8.7 బిలియన్ డాలర్లు విలువైన ఉత్పత్తులు అమెరికాకు వెళ్లినట్టు భారత్ ఫార్మాస్యూటికల్స్ ఎగుమతి ప్రోత్సాహక మండలి తెలిపింది.


నివేదికల ప్రకారం.... అమెరికాలో ఉపయోగించే జెనెరిక్ ఔషధాలలో 45 శాతం, బయోసిమిలర్ ఔషధాలలో 15 శాతం భారత్ సరఫరా చేస్తోంది. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 30 నుంచి 50 శాతం వరకు అమెరికా మార్కెట్ నుంచే పొందుతున్నాయి.


రెండు దేశాలకు ఇబ్బందే!


ఫార్మాస్యూటికల్ దిగుమతులపై ట్రంప్ అధిక సుంకాలు అమెరికా, భారత్‌ రెండింటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే ఈ సుంకాల వల్ల ఉత్పత్తి వ్యయం, ధరలు పెరిగి వినియోగదారులపై అధిక భారం పడుతుందని వారు చెబుతున్నారు. ‘ఫార్మా రంగంపై అమెరికా సుంకాలు విధిస్తే అది రెండు దేశాలను ప్రభావితం చేస్తుంది’ అని HDFC సెక్యూరిటీస్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


భారతదేశంలో తయారైన తక్కువ ధర జెనెరిక్‌ ఔషధాలపై అమెరికా ఆధారపడి ఉందని, ట్రంప్ అధిక సుంకాలు ఆ దేశంలో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఔషధాల కొరతకు దారితీస్తాయని వారు హెచ్చరించారు. ఇదే సమయంలో అమెరికా జెనెరిక్స్ రంగంలో భారతీయ కంపెనీల ఖర్చులు భారం వినియోగదారులు లేదా బీమా సంస్థలకు బదిలీ చేయాల్సి వస్తుందని నిపుణులు తెలిపారు.


కాగా, ట్రంప్ సుంకాల విషయంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. భారత్ ఎగుమతులపై ట్రంప్ 26% టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని భావించడం లేదు. ఈ విషయంలో ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa