ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లికి గంట ముందు బ్యూటీపార్లర్‌కు నవవధువు.. చనిపోయిందంటూ పేరెంట్స్ ఏడుపులు

national |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 08:50 PM

తన మనసుకు నచ్చిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు పెద్దలు. మరికాసేపట్లోనే పెళ్లనగా అందంగా ముస్తాబై వచ్చి పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. అయితే వధువు మేకప్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లగా.. ఆమెను చూడాలని తెగ ఉబలాటపడుతున్నాడు. ఇంతలోనే అమ్మాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతూ పందిట్లోకి వచ్చారు. తమ కుమార్తె రోడ్డు ప్రమాదనికి గురై చనిపోయిందని చెప్పారు. ఇలా ఒక్కసారిగా తన ఆశలన్నీ అడియాశలు కాగా పెళ్లి కొడుకు కుప్పకూలాడు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు.


దీంతో అతడి వద్ద ఒకరిని ఉంచి అబ్బాయి తరపు వాళ్లంతా అంత్రయక్రియల కోసం అని అమ్మాయి ఇంటికి వెళ్లారు. కానీ అక్కడెళ్లాకే వారికి అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ముఖ్యంగా పెళ్లి కుమార్తె బతికే ఉండడం చూసి విస్తుపోయారు. అసలా తల్లిదండ్రులు అలా అబద్ధం ఎందుకు చెప్పారు, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఓ అబ్బాయికి అదే ప్రాంతానికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయించారు. చాలా రోజుల క్రితమే వీరికి పెళ్లి కుదరగా.. ఏప్రిల్ 14వ తేదీన పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. దీంతో అటు అమ్మాయి తల్లిదండ్రులు, ఇటు అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. నిశ్చితార్థం దగ్గర నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ వంటి సంబురాలన్నీ చేశారు. మరికొన్ని గంటల్లోనే పెళ్లి ఉందనగా.. అంతా కల్యాణ మండపానికి వెళ్లారు.


అప్పటికే వంటలు కాగా.. బంధువులు, స్నేహితులంతా అక్కడకు చేరుకున్నారు. పంతులు కూడా కాబోయే వరుడితో పూజలు చేయిస్తున్నాడు. అయితే అప్పటికే మేకప్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు మాత్రం ఎంతకూ రావడం లేదు. దీంతో ఆమెతో వెళ్లిన బంధువులకు తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అప్పుడే వారు అమ్మాయి తన ప్రియుడితో కలిసి పారిపోయిందని చెప్పారు. గంటలో పెళ్లనగా కుమార్తె వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోయిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. కన్నీరుమున్నీరుగా విలపించారు.


ఇంతలోనే అక్కడకు వరుడి తరఫు వాళ్లు వచ్చి ఏమైందని ప్రశ్నించగా.. అసలు విషయం చెబితే అందరి ముందు పరువు పోతుందని భావించి.. బ్యూటీపార్లర్ నుంచి వస్తుండగా తమ కుమార్తె రోడ్డు ప్రమాదనికి గురైందని, ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. ఈ వార్త వినగానే వరుడు కుప్పకూలాడు. అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతడి వద్ద ఒకిరిని ఉంచిన వరుడి తల్లిదండ్రులు.. అంత్యక్రియల కోసం అమ్మాయి ఇంటికి వెళ్లారు. కానీ అక్కడికెళ్లాకే వారికి అసలు విషయం తెలిసింది. కాబోయే కోడలు చనిపోలేదని.. ప్రియుడితో పరారైందని చెప్పారు.


అది విన్న వాళ్లు షాక్ అయ్యారు. అబద్ధం ఎందుకు చెప్పారంటూ వధువు తరఫు వాళ్లతో గొడవకు దిగారు. పరవు పోతుందనే అబద్ధం చెప్పామని, క్షమించమంటూ కళ్లావేళ్లా పడ్డారు. తమ కుమార్తె తప్పేమీ లేదని ఇద్దరు యవకులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారని వివరించారు. ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని.. వాళ్లు దర్యాప్తు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా విన్న వరుడి తల్లిదండ్రులు చేసేదేమీ లేక ఇంటికి తిరుగుపయనం అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa