ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నా, ఐటీ రంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తూ.. కఠిన నిర్ణయాలు తీసుకుంటుండగా.. అక్కడ ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడిన భారత ఐటీ కంపెనీలు క్యూ4లో రాణిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్ ఆశాజనక ఫలితాలు ప్రకటించగా.. ఇప్పుడు మరో ఐటీ దిగ్గజం విప్రో కూడా మంచి ఫలితాల్నే నమోదు చేసింది. మార్చి 2025తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అంచనాలను మించి లాభాలను ఆర్జించడమే కాకుండా, ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచుకోవడం విశేషం. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన ఏకంగా 26 శాతం పెరిగి రూ. 3,570 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ లాభం రూ. 2,835 కోట్లుగా ఉంది.
ఇక ఆదాయం విషయానికి వస్తే, ఈ త్రైమాసికంలో విప్రో కార్యకలాపాల ద్వారా రూ. 22,504 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1 శాతం పెరిగింది. ముఖ్యంగా, స్థిర కరెన్సీ పరంగా చూస్తే, ఐటీ సేవల ఆదాయంలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, మొత్తం ఆదాయంలో వృద్ధి కనిపించడం సానుకూల అంశం.
విప్రో ఉద్యోగులు..
మరోవైపు, కంపెనీ ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. నాలుగో త్రైమాసికంలో విప్రో 614 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. దీంతో ఎఫ్వై25 చివరి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,33,346కు చేరుకుంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో, ఈ పెరుగుదల కంపెనీ వృద్ధిపై పెట్టిన దృష్టిని తెలియజేస్తుంది. అంటే రెండేళ్ల తర్వాత ఒక ఏడాదిలో విప్రోలో ఉద్యోగులు పెరిగారన్నమాట.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కంపెనీలో ఉద్యోగులు స్వచ్ఛందంగా మానేసే వారి సంఖ్య కూడా తగ్గింది. క్రితం త్రైమాసికంలో 15.3 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు, ఈసారి 15 శాతానికి తగ్గింది. కష్టకాలంలోనూ ఉద్యోగులను నిలుపుకోవడంలో విప్రో విజయం సాధించిందని ఇది స్పష్టం చేస్తోంది.
చివరగా విప్రో తన షేర్ హోల్డర్లకు రూ. 6 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ఈ డివిడెండ్ను జనవరిలోనే ప్రకటించినప్పటికీ, ఎఫ్వై25కి ఇదే తుది డివిడెండ్గా పరిగణించబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఫలితాలపై స్పందించిన విప్రో సీఈఓ, ఎండీ శ్రీని పల్లియా.. క్లయింట్ సంతృప్తి చెందడం, పెద్ద డీల్స్ను గెలవడం, బలమైన పనితీరు అమలు వంటి అంశాలు ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. స్థూల ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ, స్థిరమైన, లాభదాయకమైన వృద్ధిపై తాము దృఢంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa