ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జంధ్యం తీసేస్తేనే పరీక్ష రాయనిస్తామంటూ రచ్చ.. ఇద్దరు హోంగార్డుల సస్పెన్షన్

national |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 08:34 PM

వృత్తి విద్యా కలాశాలల్లో చేరేందుకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) పరీక్షలను ఇటీవలే కర్ణాటక సర్కారు నిర్వహించింది. అయితే పరీక్ష రాసేందుకు వెళ్లేందుకు కొందరు విద్యార్థుల మెడల్లో జంధ్యం ఉండగా.. వాటిని తీసేయాలని అధికారులు సూచించారు. అది తీసేస్తేనే లోపలికి అనుమతిస్తామని.. లేకపోతే తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో ఓ విద్యార్థి ఇంటికి వెళ్లిపోగా, మరో ఇద్దరు విద్యార్థులు మాత్రం జంధ్యాన్ని తీసేసి మరీ పరీక్ష రాశారు. ఈ విషయం కాస్తా వెలుగులోకి రాగా.. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ మొదలైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పలువురు అధికారులపై కేసులు పెట్టి, ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


వృత్తి విద్యా కలాశాలల్లో చేరేందుకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలను కర్ణాటక సర్కారు ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించింది. అయితే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని ఉపకరణాలను వెంట తీసుకు రావడానికి వీళ్లేదని ముందుగానే వివరించింది. అందులో తాళి, మెట్టెలు తప్ప మిగతా అన్ని లోహ ఆభరణాలు ఉన్నాయి. అంటే ఎలాంటి చైన్లు, పట్టీలు, గాజులు, వాచ్‌లు, దారాలు, బ్రేస్‌లెట్లు వేసుకుని పరీక్షకు హాజరు కాకూడదు. అభ్యర్థులు సైతం అధికారులు చెప్పిన నియమాలను పాటిస్తూనే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.


అయితే శివమొగ్గలోని ఆదిచుంచనగిరి పీయూ కాలేజీని కూడా పరీక్షా కేంద్రంగా పేర్కొనగా.. విద్యార్థులను తనిఖీ చేసే అధికారులు మరింతగా రెచ్చిపోయారు. ముఖ్యంగా ముగ్గురు విద్యార్థులు జంధ్యం వేసుకుని పరీక్షా కేంద్రానికి రాగా.. దాన్ని తీసేయాలని సూచించారు. జంధ్యం తీసేస్తేనే లోపలికి రానిస్తామని లేని పక్షంలో లోపలికి అనుమతి లేదంటూ వివరించారు. దీంతో ఓ విద్యార్థి జంధ్యాన్ని తీసేయలేక ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. కానీ మరో ఇద్దరు మాత్రం జంధ్యాన్ని తీసేసి పరీక్ష రాశారు. దీంతో ఈ వార్త కాస్తా వెలుగులోకి రావడంతో.. బ్రాహ్మణ మహాసభ, బీజేపీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో కర్ణాటక సర్కారు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.


ఈక్రమంలోనే విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప విద్యార్థులను అడ్డుకున్న ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేయాలని సూచించారు. దీంతో శివమొగ్గ పోలీసులు రంగంలోకి దిగి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే మరికొంత మంది అధికారులపై కూడా కేసులు నమోదు చేశామని.. ప్రస్తుతం విద్యార్థుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa