ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్.. ప్రధాన నిందితుడు అరెస్ట్..

Crime |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 11:17 PM

తెలంగాణ రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న గొర్రెల పంపిణీ పథకం అవినీతి కేసులో కీలక నిందితుడు చివరకు చిక్కాడు. ఈ పథకంలో మొదటి నుంచి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 నిందితుడు మోయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి అతడు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.


ఈ కేసులో ఇదివరకే 17 మందిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. తాజాగా ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మోయినుద్దీన్‌ను అదుపులోకి తీసుకోవడంతో దర్యాప్తు మరింత ముమ్మరం కానుంది. నేడు సాయంత్రం అతడికి రిమాండ్ విధించనున్నారు. అరెస్టు అనంతరం అతడిని వెంటనే విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాల్లో మోయినుద్దీన్ కీలక పాత్ర పోషించినట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. నిధుల మళ్లింపు, నాణ్యత లేని గొర్రెల సరఫరా.. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు వంటి అనేక అంశాల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.


దాదాపు రూ. 700 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్న ఈ పథకంలో.. పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు కూడా పాత్రధారులుగా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ అధికారులు ఇప్పటికే ఈ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మోయినుద్దీన్ అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అతడిచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ స్కాం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.


పశుసంవర్ధక శాఖ అధికారులు లబ్ధిదారుల కోసం తెలంగాణలో గొర్రెలను కొనుగోలు చేయకుండా.. వారిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి అక్కడి వ్యాపారుల నుంచి కొనుగోలు చేయించారు. అయితే, విక్రేతలకు చెల్లించాల్సిన సొమ్మును నేరుగా ఇవ్వకుండా.. మధ్యవర్తులు.. బినామీల ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రత్యేకంగా బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని ఏకంగా రూ. 2.1 కోట్లను దారి మళ్లించినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గుర్తించింది. ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయనే కోణంలో ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగించారు.


ఈ క్రమంలో బినామీ ఖాతాదారులను విచారించగా.. బ్రోకర్లు మరియు ప్రభుత్వ అధికారుల కీలక పాత్రకు సంబంధించిన బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మొత్తం కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన మోయినుద్దీన్ సూత్రధారిగా వ్యవహరించాడని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. అతడు అధికారులతో కుమ్మక్కై నిధులను బినామీ ఖాతాలకు మళ్లించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరికొందరు అధికారులు , ప్రైవేటు వ్యక్తులు కూడా లబ్ధి పొందారని ఏసీబీ అనుమానిస్తోంది. నిధుల మళ్లింపునకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు మోయినుద్దీన్‌ను మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. ఈ స్కాం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది తేలాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa