ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంకలో పహల్గామ్ ఉగ్రదాడి నిందితులు.. భారీ సెర్చ్ ఆపరేషన్

international |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 10:34 PM

జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ప్రకృతిని ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా ఏప్రిల్‌ 22వ తేదీన ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫోర్స్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ మారణహోమానికి తెరతీశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. అప్పటి నుంచి పాకిస్తాన్‌పై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువస్తూనే ఉంది. ఇక ఆ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి భూమిలో కలిపేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ఆ ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతూనే ఉన్నారు. ఇక ఈ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ కీలక దర్యాప్తు కొనసాగిస్తోంది.


ఈ క్రమంలోనే పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినవారు.. శ్రీలంకలోని కొలంబో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారనే సమాచారాన్ని భారత్.. ఆ దేశానికి అందించడంతో.. అక్కడి భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. దీంతో కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహించారు. ఆరుగురు ఉగ్రవాదులు చెన్నై మీదుగా శ్రీలంకకు వెళ్లేందుకు కొలంబో విమానం ఎక్కి ఉంటారని కేంద్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ తనిఖీలు చేపట్టారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్ 122 విమానం.. బండారునాయికే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వెంటనే ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది.


శ్రీలంక పోలీసులు, ఆ దేశ ఎయిర్‌ఫోర్స్, ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ విభాగం సంయుక్తంగా ఆ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. చెన్నై ఏరియా కంట్రోల్‌ సెంటర్ నుంచి తమకు సమాచారం వచ్చినట్లు శ్రీలంక ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. అయితే ఆ విమానంలో ఎలాంటి అనుమానిత ఉగ్రవాదులను గుర్తించలేదు. దీంతో అందులో ఉన్న వారిని వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం బండారునాయికే ఎయిర్‌పోర్టులో యధావిధిగా కార్యకలాపాలు జరుగుతున్నాయి.


మరోవైపు.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అక్కడ ఉగ్రవాదులకు సహకరించిన ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌ను దర్యాప్తు బృందాలు, భద్రతా బలగాలు భారీగా అరెస్ట్‌‍లు చేశాయి. అరెస్ట్ చేసిన వారిలో ఒకరు చెప్పిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 15వ తేదీనే ఆ ఉగ్రవాదులు పహల్గామ్‌కు చేరుకొన్నారని.. ఆ తర్వాత 4 ప్రాంతాల్లో రెక్కీ చేసినట్లు తెలిపారు. బైసరన్‌ వ్యాలీ, అరు వ్యాలీ, స్థానిక అమ్యూస్‌మెంట్‌ పార్క్‌, బేతాబ్‌ వ్యాలీలో ఉగ్రవాదులు తిరిగి అక్కడి పరిస్థితులను గమనించినట్లు తెలిపారు. అందులో చాలాచోట్ల భద్రతా బలగాలు ఉండగా.. అక్కడ దాడులు చేయలేదని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa