ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదుపుతప్పి లోయలో పడ్డ ఆర్మీ వాహనం... ముగ్గురు జవాన్లు మృతి

national |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 09:16 PM

జమ్మూ కశ్మీర్‌లో ఆదివారంఘోర ప్రమాదం సంభవించింది. సైనికులు వాహనం లోయలో పడి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు కాన్వాయ్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాంబన్ జిల్లాలోని బట్టేరే చాష్మా వద్ద జాతీయ రహదారి 44 వద్ద ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో సైనిక వాహనం అదుపుతప్పి.. పక్కనే ఉన్న 700 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనం నుజ్జునుజ్జుయి.. అందులోని పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చనిపోయారని అధికారులు తెలిపారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


మృతిచెందిన సైనికులను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మన్ భదూర్‌గా గుర్తించామని అధికారులు వెల్లడించారు.


ఇక, ఈ ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే.. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక వాలంటీర్లు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలిలో బీతావాహ వాతావరణం నెలకుంది. ప్రమాదం ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనం పడిపోయిన ప్రదేశంలోకి వెళ్లడం సహాయక బృందాలకు క్లిష్టంగా మారింది. వాహనంలో ప్రమాద సమయానికి ఎంత మంది ఉన్నారనేది సమాచారం లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ప్రహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో మరింత భద్రతను పెంచారు. ఏప్రిల్ 22న బైసరన్ లోయలో పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదుల గురించి కశ్మీర్ అంతటా జల్లెడ పడుతున్నారు. ఎక్కడికక్కడ నిఘాను పెంచి.. ముష్కరుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. దీంతో శ్రీనగర్‌కు జమ్మూ నుంచి బలగాలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో సైనిక కాన్వాయ్‌లోని వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa