భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ను మే నెలలోనే తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ చురుగ్గా ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ అనుమతి లభిస్తే, మిగిలిన మ్యాచ్ల నిర్వహణకు మూడు నగరాలను బీసీసీఐ ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం ప్రకారం, ఐపీఎల్ 18వ సీజన్లో మిగిలిన 16 మ్యాచ్లను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి దక్షిణాది నగరాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగాల్సిన ఐపీఎల్ 2025 ఫైనల్, క్వాలిఫయర్-2 మ్యాచ్లు వేరే వేదికకు తరలనున్నాయి. వాస్తవానికి, క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లు ఇతర వేదికల్లో జరగాల్సి ఉండగా, ఈడెన్ గార్డెన్స్ క్వాలిఫయర్-2, ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.మే నెలలో టోర్నీని పునఃప్రారంభించేందుకు బీసీసీఐ ఇంకా కటాఫ్ తేదీని నిర్ణయించలేదని, ఈ విషయమై ఫ్రాంచైజీలకు అనధికారికంగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ మేలో సాధ్యం కాకపోతే, ఈ ఏడాది చివర్లో సీజన్ను పూర్తిచేసే అంశాన్ని కూడా కొందరు ఫ్రాంచైజీ అధికారులు ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, అతిపెద్ద సవాలు విదేశీ ఆటగాళ్ల లభ్యతే. స్వదేశాలకు వెళ్లిన వారిని తిరిగి రప్పించడం, మేలో అందుబాటులో ఉంటారనే హామీ లేకపోవడం బీసీసీఐకి తలనొప్పిగా మారింది.ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ పాలక మండలి టోర్నమెంట్ను వారం పాటు నిలిపివేస్తున్నట్లు నిన్న ప్రకటించింది. కొత్త షెడ్యూల్, వేదికలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఇప్పటివరకు 57 మ్యాచ్లు పూర్తికాగా, గురువారం నాడు పంజాబ్-ఢిల్లీ మధ్య 58వ మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుతం 12 లీగ్ మ్యాచ్లు, నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్లు (మొత్తం 16) జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న ఫైనల్ జరగాల్సి ఉండగా, జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ఉన్నందున బీసీసీఐ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa