ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో సెలక్టర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలపై నెట్టించ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో ఒకటి సర్ఫరాజ్ ఖాన్. గతేడాది ఇంగ్లాండ్తో భారత్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్.. తన తొలి సిరీస్లోనే సత్తాచాటాడు. దీంతో ఆ తర్వాత టెస్టు జట్టులో వరుసగా అవకాశాలు అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో అతడిని ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు.
ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్కు చోటు దక్కకపోవడంపై టీమిండియా వెటరన్ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా స్పందించాడు. అతడికి ఎందుకు చోటు దక్కలేదో తన అభిప్రాయాన్ని చెప్పాడు. “ఆసియా, ఉపఖండ పిచ్లపై సర్ఫరాజ్ ఖాన్ విజయవంతమైన ఆటగాడినని నిరూపించుకున్నాడు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్లపై సర్ఫరాజ్ రాణించలేడని సెలక్టర్లు భావించి ఉన్నారని అనుకుంటున్నా. అందుకే అతడికి చోటు ఇవ్వలేదేమో. అతడికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయని.. గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడి ఫిట్నెస్పై ఐడియా లేదు. కానీ ఫిట్గా ఉండేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని మాత్రం తెలుసు” అని పుజారా వ్యాఖ్యానించాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్.. టీమిండియాలో చోటు దక్కించుకునేందుకు అర్హుడని చెప్పుకొచ్చాడు.
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa