భారతీయులకు, ముఖ్యంగా మన మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఈ ఏడాదిలో ఇప్పటికే పసిడి ధరలు భారీగా పెరిగి, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. డిమాండ్ తగ్గినా, గోల్డ్ రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుకోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దిగుమతి సుంకాల పెంపును వాయిదా వేయడం, చైనాతో అమెరికా డీల్ చేసుకోవడం వంటి పరిణామాలతో మధ్యలో బంగారం ధరలు కాస్త దిగొచ్చినా, తిరిగి మళ్ళీ ఎగబాకాయి. అయితే, తాజాగా మరో కీలక నిర్ణయం పసిడి ప్రియులకు శుభవార్త అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పడిపోవడంతో దేశీయ మార్కెట్ పైనా దాని ప్రభావం పడే అవకాశం ఉంది.
ట్రంప్ నిర్ణయంతో తగ్గిన బంగారం ధరలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యూరోపియన్ యూనియన్ వస్తువులపై జూన్ 1 నుంచి 50 శాతం సుంకాల్ని విధిస్తానని బెదిరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిని ఉపసంహరించుకున్నారు. ట్రంప్.. ఆదివారం వాషింగ్టన్- యూరోపియన్ యూనియన్ మధ్య ఒక ఒప్పందం కుదరడానికి వీలుగా జులై 9 వరకు గడువును పునరుద్ధరించారు. ఈ ఒక్క ప్రకటనతోనే సోమవారం సెషన్లో బంగారం ధరలు దాదాపు ఒక శాతం వరకు పడిపోయాయి. దీనితో సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్ తగ్గింది.
స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు దాదాపు 0.8 శాతం తగ్గి ప్రస్తుతం 3,330 డాలర్ల కిందికి చేరింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఒక శాతం తగ్గి 3,331.90 డాలర్ల వద్ద నిలిచింది. UBS విశ్లేషకుడు జియోవన్నీ స్టౌనోవో మాట్లాడుతూ, "ట్రంప్ ఈయూపై సుంకాలను వాయిదా వేయడం వల్ల ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది" అని పేర్కొన్నారు ఇదే సమయంలో సోమవారం రోజు దేశీయంగానూ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 400 తగ్గడంతో తులం రూ. 89,500 కు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 440 తగ్గగా 10 గ్రాములకు రూ. 97,640 కి చేరింది.
భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉండొచ్చు?
గత వారం, ట్రంప్ EU వస్తువులపై తిరిగి సుంకాల పెంపును ప్రకటించడంతో బంగారం ధరలు గత 6 వారాల్లోనే అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. అమెరికాలో తయారుకాకుండా అక్కడ విక్రయించే యాపిల్ ఐఫోన్లపైనా 25 శాతం సుంకం విధిస్తానని కూడా ప్రకటించారు. ఈ ప్రకటనలతోనే గోల్డ్ రేట్లు పెరగ్గా.. తాజాగా తగ్గుముఖం పడుతున్నాయి.
అయితే, UBS విశ్లేషకుడు స్టౌనోవో మాత్రం రాబోయే నెలల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పసిడి ధరలు తిరిగి ఔన్సుకు 3,500 డాలర్ల స్థాయి చేరుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సిటీ గ్రూప్.. ఆదివారం తన జీరో-టు-త్రీ మంత్ గోల్డ్ ధర లక్ష్యాన్ని 3,150 డాలర్ల నుంచి 3500 డాలర్లకు పెంచింది. దీనికి అమెరికా సుంకాల విధానాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా బడ్జెట్ ఆందోళనలు కారణమని పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల్లో చూసుకుంటే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కూడా ఉంది. రష్యా ఉక్రెయిన్పై వరుసగా దాడి చేస్తోందని ఉక్రెయిన్ ప్రాంతీయ అధికారులు, అత్యవసర సేవలు తెలిపాయి. ఈ క్రమంలోనే గోల్డ్ దీర్ఘకాలంలో పెరగొచ్చని తెలుస్తోంది.
మొత్తంగా, ట్రంప్ నిర్ణయంతో ప్రస్తుతానికి బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, భవిష్యత్ ట్రేడింగ్, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్య విధానాల ఆధారంగా.. పసిడి ధరలు ఎలా కదులుతాయో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం, బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత ఊరట కలిగించే వార్తే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa