ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 31 వరకే 'పీఎం కిసాన్‌' స్పెషల్ డ్రైవ్.. కొత్త రైతులూ పేరు నమోదు చేసుకోండి

business |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 08:01 PM

రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తోంది కేంద్రం ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 2019 నుంచి ప్రతి ఏటా ఒక్కో రైతుకు రూ.6 వేలు అందిస్తోంది. అయితే ఈ పథకంలో కొత్త రైతులు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో చాలా మంది సాయం అందుకోలేకపోయారు. చాలా రోజుల నుంచి ఈ సమస్యను కేంద్రం దృష్టికి రైతులు తీసుకెళ్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1, 2025 నుంచి మే 31 2025 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇప్పటి వరకు పీఎం కిసాన్ స్కీమ్‌లో పేరు రిజిస్టర్ చేసుకోని రైతులందరికీ కొత్తగా పేరు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు. స్థానిక అధికారులు గ్రామ స్థాయిలో ఈ డ్రైవ్‌ను సమర్థవంతంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


ఈ డ్రైవ్ ద్వారా ప్రస్తుత లబ్ధిదారులను ధ్రువీకరించడంతో పాటు ఇప్పటి వరకు నమోదు కాని అర్హత గల రైతుల్ని చేర్చుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం కిసాన్ పథకానికి అర్హతలు ఉండి, ఇప్పటి వరకు నమోదు చేసుకోని రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలి. పీఎం కిసాన్ 20వ విడత సాయం వచ్చే జూన్ నెలలోనే విడుదల కానుంది. ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న రైతులకు సైతం సాయం అందుతుంది.


చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించిన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 6,000 మూడు విడతల్లో రూ.2 వేల చొప్పన నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. పీఎం కిసాన్ పథకం కింద అర్హత పొందేందుకు రైతులు మే 31, 2025లోపు పేరు నమోదు చేసుకోవడంతో పాటు మరో రెండు పనులు పూర్తి చేయాలి. ఈ-కేవైసీ (e-KYC), లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం, రైతు భూమి రికార్డులు ధ్రువీకరణ పూర్తి చేయాలి. పీఎం కిసాన్ 19వ విడత సాయం 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. రూ. 22,000 కోట్లను 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. జూన్‌లో 20వ విడత నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుంది.


బెనిఫిషియరీ జాబితాలో మీ పేరు ఎలా చెక్ చేయాలి?


పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inలోకి వెళ్లాలి.


Beneficiary List ట్యాబ్‌ ఎంచుకోవాలి.


డ్రాప్ డౌన్ మెనూలో రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలు నమోదు చేయాలి.


Get Report ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.


బెనిఫిషియరీ లిస్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.


రైతులు ఏవైనా సందేహాలు లేదా సమస్యల కోసం 155261, 011-24300606 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa