ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షణాల్లో ఘోర ప్రమాదం.. ఒంటరైన అమ్మాయి

Crime |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 07:56 PM

రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంలో కారు, లారీ ఢీకొన్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే తల్లిని కోల్పోయిన ఒక అమ్మాయి ఈ ప్రమాదంలో అమ్మమ్మ, తాతను కూడా కోల్పోయి, ఒంటరిగా మిగిలింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకి రావడంతో.. ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. ఎడమవైపు మార్గంలో వెళ్తున్న లారీ ఒక్కసారిగా కుడివైపు ఎందుకు తిరిగింది..? ఉప్పులూరి వరప్రసాద్‌ (60 ఏళ్లు), శివలీలావతి (56 ఏళ్లు) దంపతులు కొవ్వూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె భవాని ఆరేళ్ల కిందట చనిపోవడంతో మనవరాలు పూజా భువనేశ్వరి వీరి సంరక్షణలోనే ఉంది. ప్రస్తుతం ఆమె కాకినాడలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. మనవరాలిని చూసేందుకు వీరు మే 26న తమ కారులో బయల్దేరారు. వీరితో పాటు శివలీలావతి తల్లి సత్యవతి (75) కూడా ఉన్నారు. పొరుగింట్లో నివాసం ఉండే లక్కంసాని సురేష్, బిందు (34) కూడా వీరితో పాటు బయల్దేరారు. వరప్రసాద్‌ కారు నడుపుతుండగా.. రాజానగరం సమీపంలోని ఆటోనగర్‌ కూడలి వద్దకు రాగానే ఎడమవైపు మార్గంలో వెళ్తున్న బొగ్గు లారీ ఒక్కసారిగా కుడివైపు దూసుకొచ్చింది. కారు నేరుగా వెళ్లి లారీని బలంగా ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. వరప్రసాద్, శివలీలావతి, బిందు అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన సత్యవతి రాజమహేంద్రవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ పరిస్థితి విషమంగా ఉంది. లారీ టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని కొంత మంది స్థానికులు చెబుతున్నారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa