ఐపీఎల్ 2025లో లీగ్ దశ ముగిసింది. మంగళవారం ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఆర్సీబీ.. పాయింట్స్ టేబుల్లో రెండో ప్లేసుకు దూసుకెళ్లింది. ఈ ఫలితంతో ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ఖరారైంది. ఏయే జట్టు.. ఎవరితో తలపడుతుందో తేలిపోయింది.
ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్..
14 మ్యాచులలో 9 విజయాలతో పంజాబ్ కింగ్స్ 19 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అన్నే పాయింట్లు ఉన్న ఆర్సీబీ.. నెట్ రన్ రేట్లో కాస్త వెనకబడటంతో రెండో ప్లేసులో ఉంది. 9 విజయాలతో 18 పాయింట్లు సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ మూడో ప్లేసుకు పరిమితమైంది. 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిన నాలుగో జట్టుగా ముంబై నిలిచింది.
ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ఇదే..
ఇక ఐపీఎల్ 2025లో ఇంకా నాలుగు మ్యాచులు మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్. పాయింట్స్ టేబుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. మే 29న అంటే గురువారం ఈ మ్యాచ్ ముల్లాన్పూర్ వేదికగా జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ ఇదే వేదికగా మరుసటి రోజు అంటే మే 30న జరగనుంది. ఇందులో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడతాయి.
ఫైనల్ చేరాలంటే..
క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు ఢీకొడుతుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటాయి. జూన్ 1న క్వాలిఫయర్-2 జరగనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ జూన్ 3న ఇదే వేదికగా జరగనుంది. కాగా ఐపీఎల్లో 9 ఏళ్ల తర్వాత ఆర్సీబీ క్వాలిఫయర్-1 ఆడేందుకు అర్హత సాధించింది. అటు పంజాబ్ కింగ్స్ కూడా 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa