ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం దాడికి పాల్పడ్డ ఆరుగురు ఉగ్రవాదులు బీజేపీలో చేరొచ్చు..: సంజయ్ రౌత్

national |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 07:41 PM

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే శివసేన(ఉద్దవ్ థాకరే వర్గం) సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. పహల్గాం ఉగ్రవాదుల గురించి మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్లు తాజాగా రాజకీయ దుమారానికి దారి తీస్తున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగి నెల రోజులు దాటినా దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకోకపోవడంపై కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సంజయ్ రౌత్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ ఆ ఆరుగురు ఉగ్రవాదులను పట్టుకోలేకపోయారంటే వాళ్లు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అన్నారు.


"ఉగ్రవాదులు బీజేపీలో చేరి ఉండాలి. బహుశా అందుకే వారు ఇంకా స్వేచ్ఛగా ఉన్నారు. ఆ ఆరుగురు పహల్గాం ఉగ్రవాదులను పట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ఏదో ఒక రోజు, ఆ ఆరుగురు ఉగ్రవాదులు బీజేపీలో చేరారని ఆ పార్టీ కార్యాలయం నుంచి మీకు ప్రెస్‌ నోట్ రావొచ్చు" అని బీజేపీ మాజీ మిత్రపక్షమైన సంజయ్ రౌత్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.


అలాగే పాకిస్థాన్ సహా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సాయుధ దళాలు నిర్వహించిన ప్రతీకార ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సిందూర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయం చేస్తున్నారని రౌత్ ఆరోపించారు. "మన దేశ సైనికులు ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. అయితే దాని క్రెడిట్ తీసుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంంది. అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందులో ముందంజలో ఉన్నారు." విమర్శలు గుప్పించారు.


కొన్ని రోజుల క్రితం సంజయ్ రౌత్ ఆపరేషన్ సిందూర్ విఫలమైందంటూ కూడా మాట్లాడారు. పహల్గాంలో 26 మందిని ఉగ్రవాదులు చంపేశారని, 26 మంది మహిళలు వితంతువులుగా మారారని దానికి హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రౌత్ అన్నారు. పహల్గాం దాడిని ఆపడంలో విఫలమైనందుకు అమిత్ షా రాజీనామా చేయాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా అయినా చేయాలి లేదా ప్రధాని మోదీ అయినా అమిత్ షాను తొలగించాలని రౌత్ డిమాండ్ చేశారు.


ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చి ముష్కరులు... మీరు హిందువులా, ముస్లింలా అని అడుగుతూ మరీ పురుషులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు చేశారు. ఇష్టం వచ్చినట్లుగా కాలుస్తూ.. మొత్తంగా 26 మంది అమాయక పర్యటకుల ప్రాణాలు తీశారు. దీనికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అనేక మంది ఉగ్రవాదులను చంపేసింది. కానీ దాడికి పాల్పడ్డ వాళ్లను మాత్రం ఇంకా పట్టుకోలేకపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa