ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌తో కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టుకోండి..: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

national |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 07:45 PM

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయో చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక సమావేశంలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కూలిపోయిన రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య చెప్పాలంటూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ సంబీత్ పాత్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సిందూర్‌ను శంకించే బదులు.. పోయి పాకిస్థాన్‌తో కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టుకోవాలంటూ చురకలు అంటించారు. శుక్రవారం దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎంపీ సంబీత్ పాత్ర మీడియాతో మాట్లాడారు.


ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, రేవంత్ రెడ్డి తదితర నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సహా ఆయన పార్టీ నాయకులు.. పాకిస్థాన్‌లో ఎన్ని వైమానికి స్థావరాలు ధ్వంసం అయ్యాయో, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో అడగడం లేదని, కేవలం ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలను పాక్ నేల కూల్చిందని మాత్రమే ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు రెండు వర్గాలు తయారు అయ్యాయని, ఒకటి పాకిస్థాన్‌కు మద్దతు తెలిపేది కాగా, రెండో వర్గం మొదటి వర్గం వారి కారణంగా భారతదేశానికి మద్దతతు తెలిపేందుకు గళం వినిపించలేకపోతున్నారని సంబీత్ పాత్ర పేర్కొన్నారు.


కాంగ్రెస్ వారి జైహింద్ యాత్ర.. పాకిస్థాన్ హింద్ యాత్రలా తయారైందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తమ యాత్రను ఆపేస్తేనే మంచిదని ఆయన చురకలంటించారు. అలాగే వెళ్లి పాకిస్థాన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోవాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ బీజేపీ ఎంపీ సంబీత్ పాత్ర ఎద్దేవా చేశారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచాన్ని చాటేందుకు నియమించిన అఖిలపక్ష ఎంపీల బృందాలను ఉగ్రవాదులతో పోలుస్తూ జైరామ్ రమేష్ వ్యాఖ్యలు(ఎంపీలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.. ఉగ్రవాదులూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు అంటూ జైరాం రమేష్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే) చేశారని గుర్తు చేశారు.


వాళ్లేం సరదా పర్యటనలకు వెళ్లలేదని ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచానికి తెలియజేసేందుకు వారు విదేశాలకు వెళ్లారని సంబీత్ పాత్ర గుర్తు చేశారు. ఆ బృందంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని సంబీత్ తెలిపారు. ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేశారని గురువారం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ యుద్ధ విమానాల్లో ఎన్నింటిని పాకిస్థాన్ నేల కూల్చిందని, ఆ విషయంపై చర్చ జరగాలని, సమాధానాలు తెలియాలని అన్నారు. ఈ క్రమంలో బీజేపీ చేపట్టిన తిరంగా యాత్రను కూడా రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ తన చర్యలతో భారత సైనికుల్లో మనోస్థైర్యాన్ని దెబ్బ తీసిందని, ఆ పార్టీ చేపట్టిన తిరంగా యాత్రకు కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ జై హింద్ యాత్ర చేపడుతోందని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa