ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసు ముగించేందుకు రూ.5 కోట్ల లంచం డిమాండ్,,,సీబీఐకి చిక్కిన ఈడీ అధికారి

national |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 07:46 PM

దేశంలో అవినీతి, అక్రమాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని సంస్థలు నిత్యం పనిచేస్తూ ఉంటాయి. ఏదైనా సంస్థలు అక్రమాలు చేయడం గానీ, అధికారులు లంచం తీసుకోవడం గానీ.. ఆర్థిక పరమైన నేరాలు గానీ చేసినపుడు వాటిని జరగకుండా అడ్డుకోవడం, ఒకవేళ జరిగితే వాటిలో నిందితులను గుర్తించి వారిని జైలుకు పంపించడం చేస్తుంటాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-సీబీఐ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ.. ఇలాంటి కేసులను డీల్ చేస్తూ ఉంటాయి. అయితే ఇలా అక్రమాలను అడ్డుకోవాల్సిన డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న అధికారులే అక్రమదారిలో పడి వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒడిశాలో తాజాగా ఒక ఈడీ అధికారి.. ఓ వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ.. సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు.


ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ.. ఓ కేసు విషయంలో భువనేశ్వర్‌కు చెందిన బిజినెస్‌మెన్ వద్ద రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీబీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ధెంకనల్‌కు చెందిన స్టోన్ మైనింగ్ ఆపరేటర్ రతికంత రౌత్‌పై గతంలో ఒక ఈడీ కేసు నమోదైంది. ఈ కేసులో రతికంత రౌత్‌కు సపోర్ట్ చేసేందుకు అతని వద్ద నుంచి చింతన్ రఘువంశీ రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. దానికి రతికంత రౌత్ ఒప్పుకున్నారు. ఇందులో భాగంగానే రూ.5 కోట్ల లంచంలో మొదటి వాయిదా కింద రూ.20 లక్షలు.. చింతన్ రఘువంశీకి.. రతికంత రౌత్ ఇస్తున్నట్లు సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు.. వల వేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.


  అలా ట్రీట్ చేస్తే బ్రేకప్ అనేదే జరగదు.. ప్రియాంక చెప్పింది నిఖిల్-కావ్య గురించేనా?


దీనిపై సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో భువనేశ్వర్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణ కోసం పిలిచారని.. సీబీఐ అధికారులకు రతికంత రౌత్ ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో చింతన్ రఘువంశీ తనను ఆయన ఛాంబర్‌కు పిలిచి.. ఆ కేసులో ఉపశమనం కల్పించడానికి భగతి అనే వ్యక్తిని కలవాలని సూచించినట్లు రతికంత రౌత్ సీబీఐ అధికారులకు చెప్పారు. అప్పటి నుంచి భగతి అనే వ్యక్తి రౌత్‌తో ఫోన్‌లో సంప్రదించాడని.. డబ్బులు చెల్లించి సమస్యను పరిష్కరించుకోవాలని చింతన్ రఘువంశీ.. రతికంత రౌత్‌పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.


అయితే మే 27వ తేదీన రతికంత రౌత్‌ను భగతి కలిశాడు. ఆ కేసు విషయంలో ఒక డీల్ మాట్లాడాడు. అయితే రతికంత రౌత్‌కు చెందిన ఆస్పత్రిని జప్తు చేయకుండా, అరెస్ట్ చేయకుండా, ఈ కేసును పరిష్కరించడానికి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడని భగతి చెప్పినట్లు ఎఫ్ఐఆర్‌లో సీబీఐ అధికారులు ఆరోపించాపు. అయితే అంత పెద్ద మొత్తం లంచం ఇచ్చుకోలేనని రతికంత రౌత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా.. అతడ్ని చింతన్ రఘువంశీతో భగతి మాట్లాడించాడు. చివరికి రూ.2 కోట్లకు లంచం డీల్ చేశారు. ఇందులో భాగంగానే మొదట రూ.20 లక్షలు తీసుకుంటుండగా.. రైడ్ చేసిన సీబీఐ అధికారులు ఈడీ అధికారి చింతన్ రఘువంశీని అరెస్ట్ చేశారు.


2013 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి అయిన చింతన్ రఘువంశీ.. కస్టమ్స్, పరోక్ష పన్నుల అధికారిగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే సీబీఐ అధికారులు నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుబడ్డారు. ఈ కేసులో విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa