ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాపం గుర్రానికి ఏం తెలుసు తప్పు చేస్తున్నానని.. ఇప్పుడు పోలీసులకు తిప్పలు!

national |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 07:52 PM

బీహార్‌లో ఒక వింత సంఘటన జరిగింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని నౌతన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్రం పోలీసులకు తలనొప్పిగా మారింది. గుర్రం అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడింది. ఆ గుర్రాన్ని ఉపయోగించిన నిందితుడు మాత్రం పారిపోయాడు. ఆ తర్వాత గుర్రం సంరక్షణ బాధ్యత పోలీసుల మీద పడింది. దీంతో వారు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు వేట కొనసాగించడం ఒక ఎత్తయితే, మూగజీవికి ఆశ్రయం, ఆహారం కల్పించడం మరో సవాలుగా మారింది. పోలీసులు ప్రస్తుతం తమ బాధ్యతగా గుర్రానికి కావాల్సిన ఆహారం అందిస్తూ, దాని బాగోగులు చూసుకుంటున్నారు. సరైన సంరక్షకుడు దొరికితే గుర్రం బాధ్యతలను వారికి అప్పగించాలని భావిస్తున్నారు. అప్పటి వరకు ఆ గుర్రం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉండనుంది. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.


మే 27న గుర్రంపై ఒక వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 50 లీటర్ల మద్యాన్ని నౌతన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పట్టుకున్నారు. మద్యం స్మగ్లర్ పరార్ కావడంతో ఆ గుర్రాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. అలా దాని సంరక్షణ బాధ్యత పోలీసుల మీదే పడింది. ప్రస్తుతం ఆ గుర్రానికి నౌతన్ పోలీస్ స్టేషన్‌లోనే ఆశ్రయం కల్పించారు. దానికి కావాల్సిన ఆహారం అందించే బాధ్యతను కూడా పోలీసులే చూసుకుంటున్నారు. సరైన సంరక్షకుడు దొరికే వరకు గుర్రం బాధ్యత పోలీసులదే అని ఎస్ హెచ్ ఓ రాజేష్ కుమార్ తెలిపారు.


నౌతన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గుర్రాన్ని ఆకాష్ యాదవ్ అనే వ్యక్తి అక్రమ మద్యం తరలించడానికి ఉపయోగించాడు. బీహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల కళ్లు గప్పి కొంత మంది లిక్కర్ బాటిళ్లను అక్రమంగా తరలించేందుకు రకరకాల స్కెచ్‌లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆకాష్ యాదవ్ తన అక్రమ దందా కోసం గుర్రాన్ని వాడుకున్నాడు. పాపం.. దానికేం తెలుసు? తనను ఉపయోగించుకొని తప్పుడు పనులు చేస్తున్నారని..!


పరారీలో ఉన్న ఆకాష్ కోసం ఇప్పుడు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అంతవరకూ గుర్రం బాగోగులు చూడటం మాత్రం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ‘మేము గుర్రానికి పచ్చి గడ్డి, శెనగలు, బెల్లం లాంటివి పెడుతున్నాము. ఈ ఖర్చులన్నీ పోలీస్ స్టేషన్ భరిస్తోంది. సరైన సంరక్షకుడు దొరికే వరకు దాని సంరక్షణ బాధ్యత మాదే’ అని ఎస్‌హెచ్ఓ రాజేష్ కుమార్ చెప్పారు. గుర్రాన్ని జాగ్రత్తగా చూసుకోగల వ్యక్తి కోసం ఉన్నతాధికారులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. తగిన వ్యక్తి దొరికిన తర్వాత, అధికారికంగా గుర్రాన్ని వారికి అప్పగిస్తారు.


‘గుర్రాన్ని సంరక్షించే వ్యక్తి నుంచి ఒక అఫిడవిట్ తీసుకుంటాము. వారు గుర్రాన్ని సరిగ్గా చూసుకుంటామని హామీ ఇవ్వాలి’ అని ఎస్.హెచ్.ఓ. తెలిపారు. కోర్టుకు కూడా ఈ విషయం తెలియజేస్తామని ఆయన అన్నారు. కేసు విచారణ జరుగుతున్నప్పుడు, అవసరమైతే ఆ గుర్రాన్ని కోర్టుకు కూడా తీసుకెళ్లాల్సి వస్తుందన్నారు. విచారణ పూర్తయిన తర్వాత, అధికారులు ఆ గుర్రాన్ని వేలం వేస్తారని చెప్పారు. కోర్టు ప్రక్రియ సమయంలో గుర్రాన్ని సంరక్షించిన వ్యక్తికి వేలంలో మొదటి అవకాశం ఇస్తారన్నారు. ఒకవేళ అతడు కొనడానికి ఆసక్తి చూపకపోతే.. వేలంలో ఇతరులకు అవకాశం కల్పిస్తారని పోలీసు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa