ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో ఒక షాకింగ్ సంఘటన.. మూల్యం రూ.2 లక్షలు

national |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 07:53 PM

మనుషులు ఎదుగుతున్నా, కాలం మారుతున్నా వారి ఆలోచనలు మాత్రం ఇంకా మారట్లేదు. చిన్న చిన్న విషయాలకే పలువురు గొడవలు పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గోటితో పోయేదాన్ని కూడా గొడ్డలి వరకు తెచ్చుకుని విపరీతమైన ద్వేషం, పగలు పెంచుకుంటున్నారు. దీని వల్ల తమకు ఎంత నష్టం జరుగుతుందో తెలిసినా.. ఏమాత్రం ఆలోంచకుండా ఆవేశంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చంగా అలాగే చేశారో ఇద్దరు వ్యక్తులు. ముఖ్యంగా వర్షం నీరు చిమ్మడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఓ వ్యాపారి వాహనదారుడితో గొడవకు దిగాడు. ఈక్రమంలోనే అతడు వేలును కొరికేయగా.. అది కట్ అయి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే రూ.2 లక్షలు ఖర్చు కాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


బెంగళూరుకు చెందిన జయంత్ శేఖర్ తన భార్య పార్వతి, అత్త మంజులతో కలిసి రాత్రి భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. మే 26వ తేదీన మెగాడి రోడ్డులోని రైల్వే కాలనీ ప్రాంతంలో ఆయన కారు వెళ్తుండగా.. వర్షం నీరు పక్కనే ఉన్న కారుపై పడింది. దీంతో ఆ కారులో ఉన్న వ్యక్తి, అతనితో ఉన్న మహిళ శేఖర్‌పై అరిచారు. శేఖర్ క్షమాపణ చెప్పి కారును ముందుకు పోనిచ్చాడు. అయినా వారు వెంబడించి, శేఖర్ కారును ఆపి గొడవకు దిగారు.


దీంతో శేఖర్ కూడా కిందకు దిగి.. వారితో వాదించగా అతని చేయి పట్టుకుని కుడి చేతి ఉంగరం వేలును గట్టిగా కొరికాడు. అంతేకాదు ఎడమ కంటి కింద పంచ్ ఇచ్చి బెదిరించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి, అతనితో ఉన్న మహిళ అక్కడి నుంచి పారిపోయారు. దీంతో శేఖర్ భార్య, అత్తలు వెంటనే అతడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విపరీతమైన రక్తస్రావం కాగా.. శేఖర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. అప్పటికే వేలు సగానికి పైగా కట్ కావడంతో.. అతడికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఇప్పటికే వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షలు అయ్యాయి. దీంతో శేఖర్ భార్య పార్వతి ఆ మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.


వర్షం నీళ్లు చిమ్మించినందుకు గాను తమతో ఓ జంట గొడవ పడి తన భర్త వేలిని కొరికేశారని చెప్పింది. తమపై దాడి చేసే సమయంలో సదరు వ్యక్తి సహా అతడి భార్య కూడా చాలా కోపంగా ఉన్నారని.. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించి.. వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.


మరోవైపు బాధితుడు జయంత్ శేఖర్ కోలుకుంటున్నాడు. కానీ ఈ సంఘటన అతడిపై తీవ్ర ప్రభావం చూపింది. మానసికంగా కూడా అతడు చాలా భయపడిపోయినట్లు అతడి భార్య పార్వతి చెబుతున్నారు. ఈ కేసుతో పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని.. చిన్న చిన్న గొడవలే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం కూడా ఉందని సూచించారు. అయితే బెంగళూరులోని మగాడి రోడ్డులో ఈ ఘటన జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa