ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతదేశ టైగర్ మ్యాన్ కన్నుమూత

national |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 07:26 PM

భారతదేశ ప్రఖ్యాత పులుల సంరక్షణాకారుడు, ఇండియా టైగర్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన వాల్మీక్ థాపర్ ఇకలేరు. ప్రస్తుతం 73 ఏళ్ల వయసు కల్గిన ఈయన చాలా ఏళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ వ్యాధి కారణంగానే శనివారం రోజు ఉదయం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో లోధి ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగు దశాబ్దాలకు పైగా వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎంతో కృషి చేసిన ఆయన మృతితో దేశ ప్రజలంతా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.


వాల్మీక్ థాపర్ వన్యప్రాణి సంరక్షుడే కాకుండా ఓ రచయిత కూడా. అయితే ఈయన తండ్రి రమేష్ థాపర్ ఓ జర్నలిస్టు. అతడి అత్త చరిత్రకారిణి రోమిలా థాపర్. అలాగే జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఈయనే బంధువే. అలాగే ఈయన నటుడు శశి కపూర్ కుమార్తె, థియేటర్ ఆర్టిస్ట్ సంజన కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉండగా.. భారత దేశ వన్యప్రాణుల సంరక్షణ రంగంలో మహోన్నతమైన వ్యక్తి అయిన థాపర్.. తన జీవితంలో నాలుగు దశాబ్దాలకు పైగా వన్యప్రాణులను సంరక్షించారు. తన జీవితం మొత్తం ఇందుకోసమే అంకితం చేశారు. ముఖ్యంగా వాల్మీక్ థాపర్ పులుల సంరక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు.


ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి సోషియాలజీలో గోల్డ్ మెడల్ సాధించిన ఈయన లివింగ్ విత్ టైగర్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్ వంటి 30కి పైగా పుస్తకాలు రచించారు. 1988లో ఆయన రణథంబోర్ ఫౌండేషన్ అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు. ఇది కమ్యూనిటీ ఆధారిత పరిరక్షణ ప్రయత్నాలపై దృష్టి సారించింది. బలమైన వేట నిరోధక చట్టాలు మరియు సహజ పులుల ఆవాసాల సంరక్షణ కోసం ఆయన గట్టిగా వాదించారు.


ఇప్పటి వరకు థాపర్ 150కి పైగా ప్రభుత్వ ప్యానెల్‌లు మరియు టాస్క్ ఫోర్సుల్లో పని చేశారు. వాటిలో ప్రధాన మంత్రి నేతృత్వంలోని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కూడా ఉంది. 2005లో సరిస్కా టైగర్ రిజర్వ్ నుంచి పులులు అదృశ్యం కావడంతో.. యూపీఏ సర్కారు ప్రత్యే టైగర్ టాస్క్ ఫోర్స్‌ను నియమించింది. ఇందులో పర్యావరణవేత్త సునీతా నరైన్ అధ్యక్షతన ఉన్న టాస్క్ ఫోర్స్ తుది నివేదిక మానవ-జంతు సహజీవనాన్ని ప్రోత్సహించినప్పటికీ.. థాపర్ ఒక భిన్నాభిప్రాయాన్ని సమర్పించారు. ఇలాంటి అవకాశం ఇస్తే వన్యప్రాణులకు ప్రమాదం కల్గిస్తుందని హెచ్చరించారు. పులుల దీర్ఘకాల మనుగడ, వన్యప్రాణుల కోసం మాత్రమే పెద్ద భూభాగాలను సంరక్షించాల్సిన అవసరం ఉందని వాదించారు.


అయితే చాలా ఏళ్లుగా ఈయన క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగి, ఎలాంటి ట్రీట్‌మెంట్ చేయించుకున్నా తగ్గలేదు. ఈక్రమంలోనే ఈరోజు ఆయన తన స్వగృహంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు సహా ప్రకృతి ప్రేమికులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa