ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట.. 10 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 08:09 PM

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో అభిమానులకు తీవ్ర గాయాల పాలయ్యారు. 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ఆర్సీబీ టీమ్‌ను.. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. భారీగా తరలివచ్చిన ఆర్సీబీ ఫ్యాన్స్‌ను అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేయడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.


మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్‌ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి కప్‌ను ముద్దాడింది. ఈ క్రమంలోనే గత 18 ఏళ్లుగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణం రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు.. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్, జనం భారీగా ఎగబడ్డారు. ఆర్సీబీ విక్టరీ జరుపుకునేందుకు భారీగా అభిమానులు రావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద వేలాది మంది గుమిగూడారు.


భారీగా వచ్చిన స్టేడియానికి పోటెత్తిన ఆర్సీబీ ఫ్యాన్స్‌ను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో అభిమానులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆర్సీబీ జట్టు స్టేడియానికి వస్తుందని తెలుసుకున్న ఫ్యాన్స్.. వారితో కలిసి సంబరాలు చేసుకునేందుకు మధ్యాహ్నం నుంచే స్టేడియం వద్దకు వేలాది మంది చేరుకున్నారు. తొక్కిసలాట సమయంలో స్టేడియంలోనే కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు ఉన్నారు.


దీంతో చిన్న స్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని శివాజీనగర్‌లోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్సీబీ ఆటగాళ్లు చిన్నస్వామి స్టేడియానికి రాకముందు.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వారిని విధాన సౌధలో సన్మానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa