ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫిక్స్

national |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 08:34 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల చేసింది. జులై 21వ తేదీ నుంచి ఆగస్ట్ 12వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం వెల్లడించారు. ఒకవైపు.. ఆపరేషన్ సిందూర్ గురించి చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు.. పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. అయితే నిబంధనల ప్రకారం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే అన్ని అంశాలపై చర్చించవచ్చని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.


పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ తేదీలను సిఫార్సు చేసినట్లు కిరణ్ రిజిజు వెల్లడించారు.ఈ క్రమంలోనే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని.. ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ సిందూర్ గురించి పూర్తి సమాచారం ప్రజలకు వెల్లడించాలని.. ఆపరేషన్ సిందూర్ గురించి పార్లమెంటులో చర్చించాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు.. ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయం కూడా తెలిసిందే.


ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై స్పందించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.. తాము నిబంధనల ప్రకారం వర్షాకాల సమావేశాల్లోనే అన్ని అంశాలపై చర్చించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ అయిన ఆపరేషన్ సిందూర్‌ను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే చర్చించే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ తొలి ప్రాధాన్యతా అంశంగా మారనుంది. అయితే ఆపరేషన్ సిందూర్ గురించి పార్లమెంటు ఉభయ సభల్లో చర్చిస్తే.. సభలు ఎంతవరకు సజావుగా సాగుతాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.


ఆపరేషన్ సిందూర్ జరిగినప్పటి నుంచి.. దానిపై చర్చించేందుకు స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సహా దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రంలోని మోదీ సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే నరేంద్ర మోదీ సర్కార్‌ను నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. మరోవైపు.. గత కొన్ని రోజులుగా ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని.. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa