ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌కు గూఢచర్యం కేసులో మరో యూట్యూబర్ అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 08:35 PM

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత నుంచి పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్కులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎవరైనా మన దేశానికి, దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని లీచ్ చేస్తున్నారా అని జల్లెడ పడుతున్నారు. ఈక్రమంలోనే అనేక మంది పట్టుబడుతుండగా.. తాజాగా మరో యూట్యూబర్ పట్టుబడ్డాడు. ముఖ్యంగా జ్యోతి మల్హోత్రతో ఇతడికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఇతడు పాక్ అధికారులతో ఉన్న చాటింగ్, వారి నెంబర్లను డిలీట్ చేయాలని ప్రయత్నించినట్లు కూడా గుర్తించారు.


1.1 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు..


పంజాబ్‌లోని రూపనగర్ జిల్లా మహలాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్.. "జాన్ మహల్" అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. అయితే ఇతడి ఛానెల్‌కు 1.1 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇతడికి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారి, ఐఎస్ఐకు సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న షకీర్ అలియాస్ జుట్ రాంధావాతో కూడా సంబంధాలు ఉన్నాయి. చాలా కాలంగా ఇతడితో జస్బీర్ సింగ్ మాట్లాడుతున్నాడు. అలాగే పాకిస్థాన్ రాయబా కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్‌తో కూడా టచ్‌లో ఉన్నాడు.


జ్యోతి మల్హోత్రతో కూడా దగ్గరి సంబంధాలు..


ఇది మాత్రమే కాకుండా ఇటీవలే అరెస్ట్ అయిన మరో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రతో కూడా దగ్గరి సంబంధాలు సాగిస్తున్నాడు. అలాగే డానిష్ ఆహ్వానం మేరకు జస్బీర్ సింగ్ ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో జరిగిన పాక్ జాతీయ దినోత్సవానికి కూడా హాజరయ్యాడు. 2020, 2021, 2024లలో దాయాది దేశంలో పర్యటించాడు. అయితే ఈ విషయాలు అన్నీ గుర్తించిన పోలీసులు జస్బీర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇతడి వద్ద నుంచి ఫోన్లు, కెమెరాలు, ల్యాప్‌టాప్ వంటి వేర్వేరు ఎలక్ర్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపై వాటిని ల్యాబ్‌కు పంపించారు.


ఈక్రమంలోనే జస్బీర్ సింగ్ పాకిస్థాన్‌కు చెందిన అనేక మందితో సంప్రదింపులు జరుపుతున్నాడని.. ఇప్పటికీ వారితో టచ్‌లో ఉన్నాడని తేలింది. అయితే జ్యోతి మల్హోత్ర ఇటీవలే అరెస్ట్ కాగా.. దాయాదా దేశానికి చెందిన వారందరి నెంబర్లు తొలగించేందుకు జస్బీర్ సింగ్ ప్రయత్నించాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పాక్‌కు గూఢచర్యం చేస్తున్న కేసులో పంజాబ్‌కు చెందిన ఏడుగురు అరెస్ట్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa