రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన తర్వాత కర్ణాటకలో సంబురాలు నిర్వహించింది. ఈ మేరకు బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్సీబీ ప్లేయర్లు.. ట్రోఫీతో సహా పాల్గొన్నారు. ఎప్పుడూ ఈసాలా కప్ నమదే.. నినాదంతో బరిలోకి దిగే ఆర్సీబీ.. ఈసారి కలను నిజం చేసుకుంది. ఈసాలా కప్ నమ్దు అని గర్వంగా చెప్పింది. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీతో బెంగళూరు నగరం పులకించిపోయింది. అయితే, ఇదే సమయంలో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకొని 11 మంది ప్రాణాలను కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ క్రికెటర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి కోహ్లీ మాట్లాడేందుకు మైక్ తీసుకోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ గోలగోల చేశారు. దీంతో చాలా సేపు కోహ్లీ.. మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత అభిమానులను సైలెంట్గా ఉండమని కోరాడు. చివరకు ఫ్యాన్స్ ప్రశాంతంగా ఉండటంతో కోహ్లీ మాట్లాడాడు. కెప్టెన్ రజత్ పాటీదార్పై ప్రశంసల వర్షం కురిపించాడు.
"మన నినాదం మారింది. ఇకపై ఈసాలా కప్ నమదే కాదు... ఈసాలా కప్ నమ్దు. గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా 18 ఏళ్లుగా ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు. ఇది వారి కోసమే. ఇలాంటి అభిమానులను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఏ ఫ్రాంఛైజీకి కూడా ఇలాంటి ఫ్యాన్స్ లేరు. నేను ఇంతకుముందే చెప్పాను. రజత్ పాటీదార్ దీర్ఘకాలం జట్టుకు కెప్టెన్గా ఉంటాడని. అదే నిజమైంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడినందుకు సంతోషంగా ఉంది" అని విరాట్ కోహ్లీ అన్నాడు.
కాగా ఐపీఎల్ టైటిల్ గెలిచి బెంగళూరులో అడుగుపెట్టిన ఆర్సీబీ టీమ్ సభ్యులను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సన్మానించారు. మంగళవారం జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. దీంతో తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది.
ఐపీఎల్ టైటిల్ దక్కించుకోవడం ఆర్సీబీకి 18 ఏళ్ల కల. ఈ సాలా కప్ నమదే (ఈసారి కప్ మనదే) అంటూ ప్రతి ఐపీఎల్ సీజన్లో అభిమానులు హోరెత్తించారు. చివరికి ఆ కల నెరవేరింది. దీంతో ఆర్సీబీ నినాదం కూడా మారింది. ఇక ఈ సాలా కప్ నమ్దూ నినాదం గూగుల్ ట్రెండ్స్లో నిలిచింది. ఈసారి కప్ వచ్చింది కప్ వచ్చింది అని దీని అర్థం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa