నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు గండి కొట్టే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీయుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్టయిన అతడికి బెయిల్ మంజూరు చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇటువంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని, ఇలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సరైంది కాదని స్పష్టం చేసింది.బల్గేరియా దేశానికి చెందిన రుస్లన్ పెట్రోవ్ మెతోదివ్ అనే వ్యక్తి భారత్లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నాడన్న సమాచారంతో ఢిల్లీ పోలీసులు 2023లో అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో రూ. 500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని అంచనా. దీంతో పాటు, నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే యంత్రాలు, ఇతర పరికరాలను కూడా పోలీసులు సీజ్ చేశారు.ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితుడు మొదట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, హైకోర్టు అతడి పిటిషన్ను తిరస్కరించింది. దీంతో రుస్లన్ పెట్రోవ్ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు.రుస్లన్ పెట్రోవ్ బెయిల్ పిటిషన్పై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "ఇలాంటి నేరాలు ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నిందితుడిని పోలీసులు రూ.8 లక్షల నకిలీ కరెన్సీతో పట్టుకున్నారు. అతడిపై మోపబడిన నేరారోపణలు చాలా బలంగా ఉన్నాయి. ఒకవేళ నేరం రుజువైతే, అతడికి దీర్ఘకాలిక జైలుశిక్ష పడే అవకాశం ఉంది" అని కోర్టు పేర్కొంది.ఇంతటి తీవ్రమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తే, అతడు సాక్ష్యాలను తారుమారు చేసే లేదా దేశం విడిచి పరారయ్యే అవకాశం ఉందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. "ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడి అభ్యర్థనను ఆమోదించడం ఎంతమాత్రం సరికాదు" అని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. నకిలీ కరెన్సీ చెలామణి దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లేలా చేస్తుందని, ఇలాంటి కార్యకలాపాలను ఉపేక్షించలేమని కోర్టు తేల్చి చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa