ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌లో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 04:56 PM

ఆంధ్రప్రదేశ్‌లో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తమ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు కావాల్సిన భూమిని నామమాత్రపు ధరతోనే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో రూ. 1,500 కోట్లతో క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి కాగ్నిజెంట్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా ఎనిమిదేళ్లలో 8,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. కాగ్నిజెంట్ 2029 మార్చి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందట. విశాఖపట్నం ఐటీ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.


కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేవలం 99 పైసలకే భూమిని పొందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విశాఖపట్నంలో రూ. 1,582 కోట్ల ఐటీ క్యాంపస్‌ను నిర్మించనుంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని 'కాపులుప్పాడ'లో 21.31 ఎకరాల భూమిని కాగ్నిజెంట్ కోరగా.. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రపు ధరకే కేటాయించినట్లు సమాచారం.


విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే కాగ్నిజెంట్‌ను విశాఖకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కాగ్నిజెంట్ 2029 మార్చి నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తుందని చెప్పారు. ఆ విషయంలో మరింత పురోగతి సాధించినట్లు తాజాగా వెల్లడవుతోంది.


ప్రపంచ ఆర్థిక వేదిక కోసం దావోస్‌లో జరిగిన సమావేశంలో నారా లోకేష్ కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ రవి కుమార్‌ను కలిసి విశాఖపట్నం వంటి టైర్-2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. 'కగ్నిజెంట్ కాపులుప్పాడలో 21.31 ఎకరాల భూమిని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 99 పైసల నామమాత్రపు రేటుకు భూమిని కేటాయిస్తుంది.' అని ఒక అధికారి పేర్కొన్నారు.


విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతోంది. దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌కు విషయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో టీసీఎస్‌ ఏర్పాటు కోసం ఏకంగా 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కేటాయించేందుకు నిర్ణయించింది. సంవత్సరానికి కేవలం 99 పైసల లీజు ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా మోటార్స్‌కు 99 పైసలకే భూమి కేటాయించిన విధానాన్నే ఏపీ సర్కార్ అనుసరించినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa