ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్‌లు, స్కూటీలు కొనేవారికి రెండు హెల్మెట్‌లు ఫ్రీ,,,, కేంద్రం ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 08:04 PM

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాల ప్రమాదాలను నియంత్రించేందుకు కొత్త భద్రతా నియమాలను తీసుకువచ్చింది. ఇక నుంచి బైక్, స్కూటీ కొనుగోలు చేసేవారికి.. రెండు బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్‌లను అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి విక్రయించే అన్ని టూవీలర్ వెహికల్స్‌కు రెండు హెల్మెట్‌లను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండగా.. ద్విచక్ర వాహన ప్రమాదంలో చనిపోయిన వారిలో అత్యధిక మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని.. ఇప్పటికే అనేకసార్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే బైక్‌పై ప్రయాణించే డ్రైవర్‌తోపాటు వెనకాల కూర్చున్న వ్యక్తి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ప్రతి కొత్త బైక్, స్కూటీతో పాటు రెండు బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్‌లు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త రూల్ కారణంగా రైడర్‌తో పాటు పిలియన్ రైడర్ భద్రత కూడా పటిష్టమవుతుందని కేంద్రం వెల్లడించింది. అయితే రెండు హెల్మెట్లకు బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్నవి మాత్రమే ఇవ్వాలని పేర్కొంది. దీంతోపాటు దేశంలో విక్రయించే అన్ని కొత్త ద్విచక్ర వాహనాలు, స్కూటర్లు, మోటార్ సైకిళ్లు.. ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ( ఏబీఎస్ )ను ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది.


ప్రస్తుతం మన దేశంలో విక్రయించే 125 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లు, స్కూటీలకు ఈ ఏబీఎస్ ఉండాలనే నిబంధన ఉంది. అంటే దాదాపు 40 శాతం ద్విచక్ర వాహనాలు ఈ భద్రతా ప్రమాణాల పరిధిలో లేవు. కానీ కొత్త నిబంధన అమల్లోకి వస్తే అన్ని రకాల స్కూటర్లు, మోటార్‌ సైకిళ్లకు కూడా మోడల్‌తో సంబంధం లేకుండా ఏబీఎస్ సిస్టమ్‌ను అందించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంట్రీ లెవల్ మోడల్ టూ వీలర్లే 75 శాతం వరకు ఉండొచ్చని అంచనా ఉంది. 2020 నాటి లెక్కల ప్రకారం 20 శాతం రోడ్డు ప్రమాదాలు టూవీలర్ల కారణంగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించే వారిలో 44 శాతం టూవీలర్ నడిపేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ప్రమాదాలను తగ్గించే దిశగా చర్యలు చేపడుతోంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా వాహనాలు సడన్‌గా బ్రేక్ వేసినపుడు టైర్లు లాక్ అవకుండా కాపాడతాయి. దీనివల్ల బండి స్కిడ్ అయి కింద పడిపోకుండా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa