ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంకులో నీళ్లు కలిసిన డీజిల్.. సీఎం కాన్వాయ్‌లో నిలిచిపోయిన 19 వాహనాలు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 08:20 PM

సీఎం కాన్వాయ్‌ల గురించి అందరికీ తెలిసిందే. ఆ వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయంటే చాలు.. ఆ రోడ్డు మొత్తాన్ని నిలిపివేస్తారు. అవి వెళ్లే స్పీడుకు ఏమీ అడ్డు రాకుండా ఉండాలని.. మిగతా వాహనాలన్నింటిని నిలిపివేస్తుంటారు. అలాగే సీఎం కాన్వాయ్ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా అనేక మంది పోలీసులతో బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మెుత్తం పోలీసు వ్యవస్థతోపాటు.. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇలాంటి ఓ సీఎం కాన్వాయ్ ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోయింది. అది ఏ ఒక్క వాహనమో కాదు.. మొత్తంగా 19 వాహనాలు ఒకేసారి ఆగిపోయాయి. దీంతో అధికారులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కాసేపు తెగ టెన్షన్ పడిపోయారు. వెంటనే పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.


మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు ఉన్నట్టుండి ఒకేసారి ఆగిపోయాయి. దీంతో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. అనుమానం వచ్చిన సిబ్బంది ఆ వాహనాల డీజిల్‌ ట్యాంక్‌లను తెరిచి చూడగా అందులో డీజిల్‌తో పాటు నీళ్లు కలిసి ఉండటంతో వారంతా షాక్‌ అయ్యారు. రాట్లాంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ గురువారం రాత్రి రోడ్డు మార్గంలో బయల్దేరారు. మార్గమధ్యంలో దోసిగావ్‌ అనే ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయెల్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద సీఎం కాన్వాయ్‌లోని వాహనాలన్నింటికీ సిబ్బంది డీజిల్‌ కొట్టించారు. దాదాపు 350 లీటర్ల డీజిల్ కొట్టించారు. ఆ తర్వాత కొంతదూరం ప్రయాణించగానే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. ముందుకు కదల్లేదు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది.


ఏం చేయాలో తెలియక.. సిబ్బంది తోసుకుంటూ వాటిని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. సీఎం కాన్వాయ్‌ ఆగిందన్న సమాచారం రాగానే స్థానిక యంత్రాంగం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. వాహనాలు ఎందుకు బ్రేక్‌డౌన్‌ అయ్యాయని తెలుసుకునేందుకు వారంతా తీవ్రంగా శ్రమించారు. చివరకు డీజిల్‌ ట్యాంక్‌ తెరిచిచూడగా.. అందులో నీళ్లు కన్పించాయి. వాహనాల్లో నింపిన డీజిల్‌ను బయటకు తీయగా.. సగానికి సగం అందులో నీరు కలిసినట్లుగా ఉంది.


డీజిల్‌ను కల్తీ చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఆ బంక్‌లో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా ఇదేవిధమైన ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి బంక్‌లోని డీజిల్‌ను ఒక బాటిల్‌లో తీసుకుని మరి.. అందులో నీరు ఎంత ఉందో చూపించే ప్రయత్నం చేశాడు. ఈ పరిణామాలతో వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. పెట్రోల్‌ పంప్‌ను తనిఖీ చేసి కల్తీని నిర్ధరించారు. బంక్‌లోని డీజిల్ శాంపిళ్లను టెస్టింగ్‌కు పంపారు. దాని రిజల్స్ట్‌తో పాటు సీసీటీవీ పుటేజ్‌లను సేకరిస్తున్నారు. ఆ బంక్‌ను ప్రస్తుతానికి సీజ్‌ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.


ఇక సీఎం ప్రయాణం కోసం ఇండోర్ నుంచి మరో కాన్వాయ్‌ని తెప్పించి ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. ఒక్కసారిగా ఈ ఘటనతో మధ్యప్రదేశ్ ఉలిక్కిపడింది. సాధారణంగా సీఎం కాన్వాయ్ ఆగిపోవడం అనేది ఉండదు. దానిని సెక్యూరిటీ బ్రీచ్‌గా పరిగణిస్తారు. అందుకే మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్ ఆగిపోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa