ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సునీల్ గవాస్కర్ తన పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

sports |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 08:30 PM

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనని మాటలను అన్నట్లుగా కొన్ని స్పోర్ట్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో విడుదల చేస్తూ, అభిమానులు, క్రీడా ప్రియులు అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు చేశారు.ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న 75 ఏళ్ల గవాస్కర్, ఫేక్ కోట్స్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. "గత కొన్ని నెలలుగా నేను గమనిస్తున్నాను. నేను ఎప్పుడూ చేయని వ్యాఖ్యలను, చెప్పని మాటలను కొన్ని స్పోర్ట్స్ వెబ్‌సైట్లు, వ్యక్తిగత ఖాతాలు నాకు ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి వార్తలను చదివే ముందు వాటిని నమ్మవద్దు. నిజానిజాలు నిర్ధారించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా కొన్ని వెబ్‌సైట్లు, వ్యక్తిగత ఖాతాల నుంచి వచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకండి" అని గవాస్కర్ ఆ వీడియోలో స్పష్టం చేశారు.ఇటీవల, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను అన్ని మ్యాచ్‌లలో ఆడించాలని గవాస్కర్ సూచించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ సూచనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భిన్నంగా స్పందించాడు. బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ తమకు అత్యంత ముఖ్యమని తేల్చిచెప్పాడు. "భవిష్యత్తులో చాలా క్రికెట్ ఉంది, జట్టుకు బుమ్రా ఎంత కీలకమో మాకు తెలుసు. అతను మూడు టెస్టులు ఆడతాడని ఈ పర్యటనకు రాకముందే నిర్ణయించాం" అని గంభీర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.ఇదే అంశంపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించారు. రెండో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చే ముందు భారత జట్టు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆయన హెచ్చరించారు. "ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని చూస్తుంటే, పునరాలోచించుకోవాలి. అతను లేకుండా బరిలోకి దిగి 2-0తో వెనుకబడితే, సిరీస్‌ను గెలవడం చాలా కష్టమవుతుంది" అని రవిశాస్త్రి స్కై స్పోర్ట్స్‌తో అన్నారు. ఇలాంటి కీలక చర్చలు జరుగుతున్న తరుణంలోనే, తన పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa