ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ మేరకు పిటిషన్పై విచారణను మంగళవారానికి (జులై 1) వాయిదా వేసింది.. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వైఎస్ జగన్తో పాటుగా వైవీ సుబ్బారెడ్డి, విడదల రజిని, పేర్ని నాని, కేఎన్నార్లపై కూడా వచ్చే మంగళవారం వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సింగయ్య మృతి కేసులో తమపై పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని జగన్తో పాటూ మిగిలిన వైఎస్సార్సీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు సింగయ్య మృతి కేసుకు సంబంధించి.. వైఎస్ జగన్ కారు (ఏపీ 40 డీహెచ్ 2349)ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈ మేరకు కారుకు సంబంధించి ఫిట్నెస్ను ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కారు గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 24న పోలీసులు వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం దగ్గరకు వెళ్లి ఈ కారును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు ఇవాళ తనిఖీ చేశారు.
ఈ నెల 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో గుంటూరు సమీపంలో కాన్వాయ్ వెళుతుండగా.. జగన్ కారు కిందపడి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై నల్లపాడు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. వైఎస్ జగన్తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్రెడ్డి.. వైఎస్సార్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు. ఈ కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు.
సింగయ్య కేసు మాత్రమే కాదు.. జగన్పై మరో కేసు కూడా నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ మిర్చి యార్డుకు వెళ్లారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా వైఎస్సార్సీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చారు. అలాగే ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.. వైఎస్సార్సీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్రెడ్డి, కావటి మనోహర్నాయుడు తదితరులపై కేసు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa