విజయవాడలో 'సురక్షా 360' కార్యక్రమాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. క్షణికావేశంలో వాటిని క్లిక్ చేస్తే మీ కష్టార్జితం మొత్తం సైబర్ నేరగాళ్ల పాలవుతుంది" అంటూ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని, సాంకేతికతను మంచి కోసం ఎంతగా వాడుతున్నామో, చెడుకు కూడా అంతేస్థాయిలో వినియోగిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం జరిగిన 'సురక్షా 360' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.సైబర్ నేరాలతో పాటు, భౌతిక నేరాలను కూడా సాంకేతిక పరిజ్ఞానంతోనే అరికట్టగలమని మంత్రి అనిత స్పష్టం చేశారు. "రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రతి వీధి, ప్రతి గ్రామాన్ని సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకురావడమే మా లక్ష్యం. టెక్నాలజీ వినియోగంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ ముందుండటం అభినందనీయం" అని ఆమె అన్నారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా, జిల్లాలోని ఆలయాలు, చర్చిలు, మసీదుల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన 28 'సురక్షా డివైస్ కిట్ల'ను మంత్రి పంపిణీ చేశారు. ఈ పరికరాల ద్వారా ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్బాబు మాట్లాడుతూ, "ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత సమాజం సాధ్యం. 'సురక్షా 360' కార్యక్రమం ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్ను బలోపేతం చేసి, ప్రతి పౌరుడికి భద్రతాభావం కల్పిస్తాం" అని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa