ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడాదిలో ఏకంగా రూ. 22.08 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు

business |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 11:24 PM

భారతదేశం జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ. 22.08 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 9.4 శాతం ఎక్కువ. అంతేకాదు, గత ఐదేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. మే 2025లో జీఎస్టీ వసూళ్లు 16.4 శాతం పెరిగి రూ. 2.01 లక్షల కోట్లకు చేరాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. "2024-25లో, జీఎస్టీ తన అత్యధిక స్థూల వసూళ్లు రూ. 22.08 లక్షల కోట్లను నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 9.4 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. సగటు నెలవారీ వసూళ్లు రూ. 1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


గత ఐదేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపు అయ్యాయి. 2020-21లో రూ. 11.37 లక్షల కోట్లుగా ఉన్న వసూళ్లు, ఇప్పుడు రూ. 22.08 లక్షల కోట్లకు పెరిగాయి. 2020-21లో సగటు నెలవారీ వసూళ్లు రూ. 95,000 కోట్లుగా ఉండేవి. జీఎస్టీ వసూళ్లలో నిలకడైన వృద్ధి కనిపిస్తోంది.


జీఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..


- 2020-21: రూ. 11.37 లక్షల కోట్లు (నెలవారీ సగటు: రూ. 95,000 కోట్లు)


- 2021-22: రూ. 14.83 లక్షల కోట్లు


- 2022-23: రూ. 18.08 లక్షల కోట్లు


- 2023-24: రూ. 20.18 లక్షల కోట్లు


- 2024-25: రూ. 22.08 లక్షల కోట్లు


జీఎస్టీ సక్రమంగా చెల్లించడం, ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీని జులై 1, 2017న దేశంలో ప్రవేశపెట్టారు. జులై 1, 2025 నాటికి జీఎస్టీ వచ్చి.. 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.


ఏప్రిల్ 30, 2025 నాటికి దేశంలో 1.51 కోట్లకు పైగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇందులో 1.32 కోట్లకు పైగా సాధారణ పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. 14.86 లక్షల మంది కాంపోజిషన్ పన్ను చెల్లింపుదారులు, 3.71 లక్షల మంది టీడీఎస్ (TDS) చెల్లింపుదారులు ఉన్నారు.


మే 2025లో జీఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. మే నెలలో 16.4 శాతం వృద్ధితో రూ. 2.01 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన ఆదాయం 13.7 శాతం పెరిగి రూ. 1.50 లక్షల కోట్లుగా నమోదైంది. దిగుమతుల నుంచి వచ్చిన జీఎస్టీ ఆదాయం 25.2 శాతం పెరిగి రూ. 51,266 కోట్లుగా ఉంది.


సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ. 35,434 కోట్లుగా, స్టేట్ జీఎస్టీ ఆదాయం రూ. 43,902 కోట్లుగా ఉంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 1.09 లక్షల కోట్లుగా నమోదైంది. మే నెలలో మొత్తం జీఎస్టీ రీఫండ్‌లు 4 శాతం తగ్గి రూ. 27,210 కోట్లకు చేరుకున్నాయి. ఈ గణాంకాలు చూస్తుంటే, దేశ ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతోందని అర్థమవుతోంది. వ్యాపారాలు కూడా ఊపందుకుంటున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa