మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారా? అయితే మీకోసం ఒక ముఖ్యమైన అలర్ట్! ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలలో కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నియమాలు జులై 15 నుంచి అమలులోకి రానున్నాయి. దీని వల్ల బిల్లు చెల్లింపుల విధానంలో మార్పులు రావడమే కాకుండా, కొన్ని ప్రయోజనాల్లోనూ కోత పడనుంది. ఈ మార్పులు మీ ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపించే అవకాశం ఉంది, కాబట్టి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం తప్పనిసరి.
మారనున్న కనీస చెల్లింపు మొత్తం లెక్క..
క్రెడిట్ కార్డ్ వినియోగదారుల్లో చాలా మంది ఆలస్య రుసుములను తప్పించుకునేందుకు, బిల్లులో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తుంటారు. దీన్నే కనీస చెల్లింపు మొత్తం అంటారు. అయితే, జులై 15 నుంచి ఈ కనీస మొత్తం లెక్కించే విధానం పూర్తిగా మారనుంది. ఇకపై కనీస చెల్లింపు మొత్తాన్ని లెక్కించేటప్పుడు, జీఎస్టీ, ఈఎంఐలు, ఫీజులు , ఇతర ఛార్జీలతో పాటు, మిగతా అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్పై అదనంగా 2 శాతం మొత్తాన్ని కూడా కలపనున్నారు.
దీని అర్థం, మీరు చెల్లించాల్సిన కనీస మొత్తం గతంలో కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు పెరిగిన ఈ మొత్తాన్ని చెల్లించకపోతే, మీ బకాయిలు మరింత పెరుగుతాయి. దీని వల్ల మీరు చెల్లించాల్సిన వడ్డీ భారం గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి, ఈ కొత్త నిబంధనపై జాగ్రత్త వహించడం తప్పనిసరి.
చెల్లింపు సర్దుబాటు విధానంలో మార్పులు..
కార్డు వినియోగదారులు చేసే చెల్లింపు మొత్తాన్ని బ్యాంక్ సర్దుబాటు చేసే విధానం కూడా జులై 15 నుంచి మారనుంది. ఈ కొత్త విధానం ప్రకారం.. ఇక నుంచి మీరు చేసే ఏ చెల్లింపులైనా, మొదట జీఎస్టీ కింద జమ అవుతాయి. ఆ తర్వాత, ఈఎంఐ బకాయిలు సర్దుబాటు చేస్తారు. అనంతరం, ఛార్జీలు, ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కింద చెల్లింపులు జరుగుతాయి. చివరగా, రిటైల్ షాపింగ్ కోసం చేసిన ఖర్చులు లేదా నగదు విత్డ్రా చేసుకున్న మొత్తానికి సర్దుబాటు చేస్తారు.
దీని అర్థం ఏమిటంటే, మీరు ఛార్జీలు గానీ, వడ్డీ గానీ చెల్లించకుండా ఉన్నట్లయితే, ముందుగా మీరు చేసే చెల్లింపుల్లో నుంచి వాటిని కట్ చేసుకుంటారు. అప్పుడు మీరు బిల్లులో కొంత మొత్తమే చెల్లించినట్లయితే, మీపై అదనంగా వడ్డీ భారం పడుతుంది. ఇది మీ ఆర్థిక ప్రణాళికను ప్రభావితం చేయగలదు కాబట్టి, సకాలంలో పూర్తి బిల్లును చెల్లించడం శ్రేయస్కరం.
ఎస్బీఐ క్రెడిట్ కార్డుల్లో రానున్న మరో పెద్ద మార్పు ఆగస్టు 11 నుంచి అమల్లోకి రానుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అందించే కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఎస్బీఐ ఎత్తివేయనుంది. ప్రస్తుతం కొన్ని కార్డులపై ఈ బీమా రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉండగా, త్వరలోనే దీన్ని బ్యాంక్ నిలిపివేయనుంది.
ఈ సదుపాయాన్ని ఎత్తివేయనున్న కార్డుల జాబితాలో యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ఎలైట్ ,పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ ఎలైట్, కేవీబీ ఎస్బీఐ కార్డ్ ఎలైట్, కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్, అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్, యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ప్రైమ్, పీఎస్బీ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ , కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa