కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా టీవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన 'క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ' సీరియల్లో తన ఐకానిక్ పాత్ర 'తులసి'గా ఆమె పునరాగమనం చేస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు స్మృతి ఇరానీకి టీవీ నటిగా అపారమైన కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన పాత్ర ఇదే కావడం విశేషం.ఈ సీరియల్కు సంబంధించిన ఫస్ట్ లుక్ను తాజాగా విడుదల చేశారు. ఇందులో స్మృతి ఇరానీ మెరూన్ రంగు జరీ పట్టు చీరలో, నుదుటన పెద్ద సైజు ఎర్ర బొట్టు, మంగళసూత్రం, బంగారు ఆభరణాలతో అచ్చం పాత తులసి పాత్రను గుర్తుచేసేలా కనిపించారు. 2000 నుంచి 2008 వరకు ప్రసారమైన ఈ సీరియల్, ఏడేళ్ల పాటు అత్యధిక రేటింగ్స్తో నెంబర్ వన్ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ సీరియల్ పార్ట్-2 వస్తోంది.గతంలో 'వుయ్ ద వుమెన్' షోలో బర్ఖా దత్, కరణ్ జోహార్తో మాట్లాడుతూ స్మృతి ఇరానీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వాస్తవానికి 2014లోనే ఈ సీరియల్లో నటించడానికి తాను ఒప్పందం చేసుకున్నానని, అయితే అదే సమయంలో పార్లమెంటుకు ఎన్నికై, కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని పీఎంవో నుంచి పిలుపు రావడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. "టీవీ, సినిమాల్లో నటించడం కన్నా దేశానికి సేవ చేయడం గొప్పది" అని దివంగత నటుడు రిషి కపూర్ తనకు సలహా ఇచ్చారని ఆమె ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. పదేళ్ల విరామం తర్వాత, ఇప్పుడు మళ్లీ అదే పాత్రతో ప్రేక్షకులను పలకరించేందుకు స్మృతి ఇరానీ సిద్ధమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa