భారత్తో మాంచెస్టర్ వేదికగా జరిగే నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్.. తమ ప్లేయింగ్ లెవెన్ను ప్రకటించింది. బుధవారం మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగానే అంటే సోమవారమే తమ జట్టును ప్రకటించింది. మూడో మ్యాచ్తో పోలిస్తే.. కేవలం ఒకే ఒక్క మార్పుతో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది. మూడో టెస్ట్లో గాయపడ్డ స్పిన్నర్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ను తుది జట్టులోకి తీసుకుంది. వరుసగా విఫలమవుతున్నా.. జాక్ క్రాలీ, క్రిస్ వోక్స్లకు మరో అవకాశం ఇచ్చింది.
8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..
షోయబ్ బషీర్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో ఇంగ్లాండ్కు మరో స్పిన్నర్ ఎంపిక అనివార్యమైంది. దీంతో 35 ఏళ్ల లియామ్ డాసన్ను జట్టులోకి తీసుకుంది. అతడు చివరగా 2017 జులైలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అతడు మళ్లీ ఇంగ్లాండ్ తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడనున్నాడు.
మాంచెస్టర్ టెస్ట్కు ఇంగ్లాండ్ తుది జట్టు..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జెమీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్
ఇక భారత జట్టు మాత్రం మ్యాచ్ టాస్ సమయంలోనే తుది జట్టును ప్రకటించనుంది. 24 ఏళ్ల పేసర్ అన్షుల్ కాంబోజ్ టీమిండియా తరఫున డెబ్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆకాశ్ దీప్ గాయపడటం, ప్రసిద్ధ్ కృష్ణ వరుసగా విఫలం కావడంతో మేనేజ్మెంట్ అన్షుల్ వైపు మొగ్గుచూపుతోంది. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అన్షుల్ కొత్త బంతితో బ్యాటర్లకు బంతులు సంధించాడు. దీంతో అతడు డెబ్యూ చేస్తాడనే అంచనాలు ఏర్పడ్డాయి. ఐదు మ్యాచ్ల సిరీస్లో 3 మ్యాచ్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్లో గెలిచి.. సిరీస్ను సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. జులై 23న మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa