జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరగనున్న నాలుగో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్పకుండా ఆడతాడని మహమ్మద్ సిరాజ్ వెల్లడించాడు. మీడియాతో మాట్లాడిన అతడు.. బుమ్రాపై కీలక అప్డేట్ ఇచ్చాడు. ఆకాశ్ దీప్ గాయం నుంచి కోలుకుంటున్నాడని.. అతడిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మియాన్ చెప్పాడు. అంతేకాడు, పిచ్ పరిస్థితిని బట్టి టీమిండియా తుది జట్టు ఎంపిక ఉంటుందని సిరాజ్ అన్నాడు.
బుధవారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే కీలక ఆటగాళ్లు గాయపడటంతో టీమిండియా తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బుమ్రా ఆడతాడా లేడా? ఆకాశ్ దీప్ గాయం నుంచి కోలుకున్నాడా? తుది జట్టు ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు అభిమానులకు తలెత్తుతున్నాయి. అయితే మాంచెస్టర్ టెస్ట్కు ముందు మాట్లాడిన భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ .. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.
ఈ టెస్టులో బుమ్రా ఆడతాడా లేడా అన్న ప్రశ్నపై అటు టీమ్ మేనేజ్మెంట్ గానీ, కెప్టెన్, కోచ్ ఎవరూ స్పందించలేదు. కానీ మీడియాతో మాట్లాడుతూ సిరాజ్ తనకు తెలియకుండానే అప్డేట్ ఇచ్చేశాడు. బుమ్రా మాంచెస్టర్ టెస్టులో తప్పకుండా ఆడతాడని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో గాయపడ్డ ఆకాశ్ దీప్ పూర్తిగా కోలుకున్నాడా? లేడా అన్న ప్రశ్నకు సైతం సిరాజ్ బదులిచ్చాడు. అతడు ఇప్పుడిప్పుడే మళ్లీ బౌలింగ్ చేస్తున్నాడని.. ఫిజియోలు పరీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.
పిచ్, జట్టు అవసరాల దృష్ట్యా మాంచెస్టర్ టెస్ట్కు తుది జట్టు ఎంపిక ఉంటుందని సిరాజ్ అన్నాడు. కాగా నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో దూరం కాగా.. అతడి ప్లేసులో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆకాశ్ దీప్ ప్లేసులో అన్షుల్ కాంబోజ్ను ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కరుణ్, సాయి సుదర్శన్లలో ఒకరు తుది జట్టులో ఉండనున్నారు. జులై 23న మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
నాలుగో టెస్ట్ కోసం భారత జట్టు ఇదే..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa