ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్‌.. భారత్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న చైనా

international |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 07:51 PM

భారత్‌తో నీటి యుద్ధానికి తెర తీసిన చైనా.. దీనిలో భాగంగా బ్రహ్మపుత్ర నది మీద జలవిద్యుత్తు కోసం భారీ డ్యాం నిర్మాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇండియాకు సరిహద్దుగా ఉన్న ఆగ్నేయ టిబెట్‌లో బ్రహ్మపుత్ర నది మీద.. చైనా ఈ భారీ డ్యామ్ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. అయితే డ్యాం నిర్మాణం పట్ల ఇండియా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల కారణంగా.. దిగువన ఉన్న ప్రాంతాలకు నీటి సరఫరా తగ్గుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలో తాజాగా డ్రాగన్ కంట్రీ బ్రహ్మపుత్ర డ్యాం గురించి కీలక ప్రకటన చేసింది. దీని వల్ల ఇండియాకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని ప్రకటించింది. ఆ వివరాలు..


 టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది మీద.. జలవిద్యుత్తు ప్రాజెక్టు కోసం.. జలాశయం నిర్మించడాన్ని డ్రాగన్ దేశం చైనా సమర్థించుకుంది. ఈ డ్యాం నిర్మాణం ద్వారా.. బ్రహ్మపుత్ర నదీ జలాలు మళ్లించుకోవడం కానీ.. ఇతర రకంగా వినియోగించుకోవడం చేయబోమని చైనా స్పష్టం చేసింది. ఈ డ్యాం నిర్మాణం పట్ల దిగువ పరీవాహక ప్రాంత దేశాలైన ఇండియా, బంగ్లాదేశ్‌లు భయపడాల్సిన పని లేదని.. డ్యాం నిర్మాణంపై ఆందోళన వద్దని చైనా బుధవారం స్పష్టం చేసింది.


బ్రహ్మపుత్ర నది మీద తాము నిర్మించ తలబెట్టబోయే డ్యాం నిర్మాణం వల్ల.. ఈ నది దిగువ ప్రాంతాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ వెల్లడించారు. డ్యాం నిర్మాణానికి సంబంధించి.. బ్రహ్మపుత్ర నదికి దిగువన ఉన్న రెండు దేశాలకు అవసరమైన సమాచారం అందించామని చెప్పుకొచ్చారు. అలానే ఈ నదీ ప్రవాహ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆయా దేశాల ప్రజల ప్రయోజనం కోసం చైనా కచ్చితంగా సహకారం అందిస్తుందని తెలిపారు. డ్యాం నిర్మాణ నిర్ణయం..చైనా సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయమన్నారు. కాలుష్యరహిత విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం ఈ డ్యాం నిర్మాణం చేపట్టామని.. దీని వల్ల దిగువ దేశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని చైనా స్పష్టం చేసింది.


చైనా దేశంలో బ్రహ్మపుత్ర నదిని యార్లంగ్‌ జాంగ్‌పో అని పిలుచుకుంటారు. ఈక్రమంలో డ్రాగన్ కంట్రీ ఈ నది మీద వాస్తవాధీనరేఖకు అతి దగ్గర్లో డ్యాం నిర్మాణం మొదలు పెట్టింది. స్వయంగా చైనా ప్రధాని లీ కియాంగ్ గత శనివారం దీన్ని ప్రారంభించారు. స్వయంగా ప్రధాని విచ్చేశారంటే..ఈ డ్యాంకు డ్రాగన్ కంట్రీ ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ డ్యాం నిర్మాణం వాస్తవాధీనరేఖకు అతి సమీపంలోని న్యింగ్చి నగరం వద్ద ప్రారంభించారు. ఈ ప్రాంతం అరుణాచల్‌ప్రదేశ్‌కు అతి సమీపంలో ఉంది.


బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మాణం వల్ల నీటి ప్రవాహం, దాని వాటా గురించి భారత్, బంగ్లాదేశ్‌ల ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా.. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణవేత్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన టిబెటన్ పీఠభూమిలో ఇలాంటి భారీ ప్రాజెక్టులను నిర్మిస్తే.. పర్యావరణ పరంగా అనూమ్య మార్పులు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రాంతంలో భూకంపాలూ సంభవింవే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa