మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తీసుసుకొచ్చిన పథకంలో లొసుగులను కొందరు అక్రమార్కులు ఆసరాగా తీసుకుని మోసాలకు తెరతీశారు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.1,640 కోట్లు కాజేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం లాడ్లీ బెహన్ యోజన పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద 14,298 మంది పురుషులు మోసపూరితగా పేర్లు నమోదు చేసుకొని రూ.21.44 కోట్లు కాజేసినట్టు ప్రభుత్వం నిర్వహించిన ఆడిట్లో వెల్లడయ్యింది. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించింది. వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపల ఉన్న కుటుంబాలకు చెందిన 21 నుంచి 65 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 చొప్పున ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో పథకం తీసుకొచ్చింది.
నిందితులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని మహిళలుగా పేరు నమోదు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పథకం ప్రారంభమైన 10 నెలల తరువాత మోసం బయటపడటం గమనార్హం. ‘‘నిరుపేద కుటుంబాల మహిళలకు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో లాల్డీ బెహన్ యోజన పథకాన్ని ప్రారంభించాం.. పురుషులకు ఈ పథకంతో లబ్ది పొందకూడదు ఈ మొత్తాన్ని తిరిగి వారి నుంచి వసూలు చేస్తాం..అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు.
కుటుంబంలో ఇద్దరు మహిళలకు మాత్రమే ఈ పథకం పరిమితం కానీ, ఇద్దరకు మించి 7.97 లక్షల మంది, 65 ఏళ్ల దాటిన 2.87 లక్షల మంది మోసపూరితంగా పేరు నమోదుచేసుకుని లబ్ది పొందడం గమనార్హం. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 1,640 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇక, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలకు నెలకు రూ.2 వేల చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తోంది.
కాగా, దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. మహిళల పథకంలో పురుషులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించారు. ‘‘ఎలా నమోదు చేసుకున్నారు? వారికి సహాయం చేసిన వాళ్లెవరు? రిజిస్ట్రేషన్లకు కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీపై దర్యాప్తు చేపట్టాలి.. ఇది పెద్ద కుట్ర. ఈ వ్యవహారాన్ని సిట్ లేదా ఈడీతో దర్యాప్తు చేయాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గతేడాది డిసెంబరులో ఈ పథకంపై సమగ్ర సమీక్షకు ఆదేశించారు. దీంతో అధికారులు మొత్తం 5 లక్షల మంది అనర్హులను ఫిబ్రవరి 2025లో గుర్తించి, వారిని తొలగించారు. అలాగే, గత జూన్ నుంచి 26.34 లక్షల మంది అనర్హుల ఖాతాలకు నిధులను తాత్కాలికంగా నిలిపివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa