ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లికి ముందు హెచ్‌ఐవీ టెస్ట్ తప్పనిసరి.. మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 08:06 PM

పెళ్లికి ముందు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ పరీక్షలను తప్పనిసరి చేసే కొత్త చట్టాన్ని మేఘాలయ తీసుకురానుంది దేశంలో మొదటిసారిగా ఈ చట్టాన్ని గోవా అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రంలోనూ తీసుకొస్తున్నట్టు మేఘాలయ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాజెల్ అంపైన్ లైంగ్డో ప్రకటించారు. ఇప్పటికే గోవాలో అమల్లో ఉన్న ఈ విధానం మేఘాలయలో కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. మంత్రి లైంగ్డో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గోవా తరహాలో మేం కూడా పెళ్లికి ముందు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ పరీక్షను తప్పనిసరి చేసే చట్టాన్ని తీసుకొస్తున్నాం... ఇది మా సమాజాలకు ఎంతో మేలుచేస్తుంది’’ అని అన్నారు. ఇక, ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారి నియంత్రణకు ఇప్పటి వరకూ ఎటువంటి టీకాలు, ఔషధాలు అందుబాటులో లేనప్పటికీ నివారణే ముఖ్యమని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌తో 4 కోట్ల మరణాలు సంభవిస్తున్నాయి.


రాష్ట్రంలో హెచ్ఐవీ వ్యాప్తి అత్యంత ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటూ ఇటీవల మేఘాలయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఎంఏసీఎస్) నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు యువతీయువకులు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరిగా చేసుకునేలా చట్టంపై నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ముఖ్యంగా తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో గతేడాది 3,432 హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఇది ముందు సంవత్సరంతో పోల్చితే రెట్టింపు. వీరిలో కేవలం 1,581 మంది మాత్రమే యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) చికిత్స పొందుతున్నారని మంత్రి లైంగ్డో వెల్లడించారు.


మేఘాలయ డిప్యూటీ సీఎం ప్రెస్టోన్ త్యిన్సోంగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి..హెచ్‌ఐవీ/ ఏయిడ్స్‌పై సమగ్ర విధానం రూపొందించాలని నిర్ణయించారు. ఆరోగ్య శాఖకు దీనిపై క్యాబినెట్ నోట్ తయారు చేయాలని సూచించారని మంత్రి తెలిపారు. ‘‘రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అధికారులు, వైద్య నిపుణులతో చర్చలు జరిపి, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలు రూపొందించనున్నాం.. జైంతియా హిల్స్ ప్రాంతంలో అత్యధిక కేసులు ఉన్నాయ’’ అని మంత్రి వివరించారు. కాగా, ఇటీవల దేశంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్యను తెలుసుకోడానిక ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ పాపులేషన్ సైజ్ అండ్ ఎస్టిమేషన్ (పీఎంపీఎస్ఈ) సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


హెచ్ఐవీ పరీక్షలు చేసుకుని.. పాజిటివ్‌గా నిర్దారణ అయినవారిని తప్పకుండా చికిత్స వ్యవస్థలోకి తీసుకురావాలి...సరైన రీతిలో ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటే మరణముప్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఎంఏసీఎస్ నివేదిక ప్రకారం.. అరక్షిత లైంగిక సంబంధాలే రాష్ట్రంలో హెచ్‌ఐవీ వ్యాప్తికి ప్రధాన కారణమని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa