ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరిద్వార్ ఆలయంలో తొక్కిసలాటకు కారణం ఏంటి? పోలీసులు ఒకలా.. అధికారులు మరోలా

national |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 08:09 PM

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ మాససా దేవి ఆలయం మెట్ల మార్గంలో ఆదివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.., మరో 34 మంది గాయపడ్డారు. ప్రమాదంలో 8 మంది చనిపోయినట్టు హరిద్వార్ జిల్లా కలెక్టర్ మయూర్ దిక్షిత్ ధ్రువీకరించారు. గాయపడినవారిలో మరో ఇద్దరు భక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. మిగతావారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. క్షతగాత్రుల్లో


20 మంది పురుషులు, 8 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. శ్రావణమాసం నేపథ్యంలో ఉత్తరాదిలో ఆలయాలను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.


తొక్కిసలాటకు కారణం?


ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆలయ మెట్ల సమీపంలో ఓ ఓవర్‌హెడ్ విద్యుత్ వైర్ తెగి నడకదారిపై పడినట్లు ఒక పుకారు వ్యాపించడంతో గందరగోళం, ఆందోళన నెలకొని తొక్కిసలాటకు దారితీసింది. విద్యుత్ వైర్ తెగిపడి విద్యుదాఘాతం జరిగిందా? లేక కేవలం పుకారేనా? అన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఒకరు మాత్రమే కరెంట్ షాక్‌కు గురై కాలిన గాయాలతో బాధపడుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మిగతావారంతా తొక్కిసలాట వల్లే గాయపడ్డారు. శ్రావణమాసంలో కన్వర్ యాత్రికులు పవిత్ర జలాలను తీసుకెళ్లడానికి హరిద్వార్‌కు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ క్రమంలోనే మానసా దేవి దర్శనం కోసం పోటెత్తారు.


హరిద్వార్ నగర పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ రితేశ్ సహా మాట్లాడుతూ.. ‘కరెంట్ తీగ పడిన దృశ్యం కనిపించగానే ఒక్కసారిగా జనాలు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది’ అని వివరించారు. మరోవైపు, ఈ దుర్ఘటన అనంతరం ఉత్తరాఖండ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (UPCL) మానసా దేవి ఆలయ పరిసరాల్లోని అన్ని విద్యుత్ ప్యానెల్లు, తీగలను తనిఖీలు నిర్వహించింది. యూపీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘విద్యుత్ తీగ తెగిపడిందనేది తప్పుడు సమాచారం.. మా విద్యుత్ లైన్లు అన్నీ పూర్తిగా ఇన్సులేట్‌తో ఉన్నాయి... ఎక్కడా ఓపెన్ వైర్లు లేవు.. విద్యుత్ షాక్‌ వల్ల ఎవ్వరూ గాయపడలేదు. రద్దీ, నియంత్రణ లోపం వల్లే ఈ విషాదకర సంఘటన జరిగినట్టు కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘హరిద్వార్ మానసా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన అత్యంత బాధాకరం. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. జిల్లా అధికార యంత్రాంగంతో నిరంతరం మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నాం... క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa