ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగ భృతి అప్పటి నుంచే.,,,,టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 10:48 PM

నిరుద్యోగ భృతి.. 2024 ఏపీ శాసనసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒకటి. 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటుగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.3000 ఇస్తామని టీడీపీ కూటమి అప్పట్లో హామీ ఇచ్చింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ భృతి హామీ యువతలోకి బలంగా చొచ్చుకెళ్లింది. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నిరుద్యోగ భృతి హామీ కూడా అమలు చేసింది. అయితే 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోవటంతో ఆ పథకం కొనసాగలేదు.


అయితే 2024 ఎన్నికల సమయంలోనూ టీడీపీ మరోసారి నిరుద్యోగ భృతి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే ఒకరు నిరుద్యోగ భృతి పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నుంచి నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తామని గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. ఓ కార్యక్రమంలో భాగంగా మహిళలతో ముచ్చటించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి.. ఈ ఏడాది ఆఖరి నుంచి నిరుద్యోగ భృతి పథకం కింద నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3000 అందించనున్నట్లు వెల్లడించారు. డిగ్రీ పూర్తి చేసిన రెండేళ్లలోపు ఉద్యోగం రాకపోతే.. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చెప్పుకొచ్చారు.


మరోవైపు నిరుద్యోగ భృతిపై ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా జూన్ నెలలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్.., ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని ప్రకటించారు. తాజాగా గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే కూడా దీనికి బలం చేకూరేలా వ్యాఖ్యలు చేయడంతో నిరుద్యోగ యువతలో ఆశలు మొలకెత్తుతున్నాయి.


మరోవైపు సూపర్ సిక్స్ హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పింఛన్ల పెంపు, తల్లికి వందనం పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుచేసిన ప్రభుత్వం.. ఆగస్ట్ 2వ తేదీ అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయనుంది. అలాగే ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa