ప్రస్తుతం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. ప్రతి ఏటా వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి గురించి సరైన అవగాహన లేక.. తొలి దశలోనే గుర్తించకపోవడంతో.. చాలా మంది క్యాన్సర్ బాధితులు ప్రాణం పొగోట్టుకుంటున్నారు. నేటికి కూడా మన దేశంలో క్యాన్సర్కు సరైన ట్రీట్మెంట్ లభించడం లేదు. ధనవంతులైతే విదేశాలకు వెళ్లి క్యాన్సర్ చికిత్స పొందుతుంటారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా క్యాన్సర్ కేంద్రాలను విస్తరించేందుకు నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం .. ఏపీకి శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ రోగుల కోసం ఒక కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనిలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 200కు పైగా కొత్త క్యాన్సర్ డే కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 200 కేంద్రాల్లో.. 14 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ లోక్సభ వేదికగా ప్రకటించారు. వీటి ద్వారా క్యాన్సర్ రోగులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ 14 డే కేర్ కేంద్రాలు రానున్నాయి. అనంతపురం, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, కర్నూలు, కాకినాడ, కృష్ణా, ప్రకాశం, పల్నాడు, తూర్పుగోదావరి, నంద్యాల, విజయనగరం, ఎన్టీఆర్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, ఎన్హెచ్ఎం కింద ఇప్పటి వరకు దేశంలోని 10.18 కోట్ల మంది మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామని.. ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అలానే వైద్య విద్యను మెరుగుపరచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. పీఎంఎస్ఎస్వై పథకం కింద 19 ఎయిమ్స్లలో యూజీ కోర్సులు ప్రారంభించారు. అంతేకాకుండా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో యూజీ, పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచారు. అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు 51,348 నుంచి 1,15,900కు పెరిగాయి. అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 31,185 నుంచి 74,306కు పెరిగాయని తెలిపారు. అలానే 'ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' (ఏబీ–పీఎంజేఏవై) పథకం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 41 కోట్ల ఆయుష్మాన్ కార్డులను సృష్టించామని ప్రతాపరావు జాదవ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa