ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోల్పోకూడదంటే నిలబడాల్సిన మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. మాంచెస్టర్ టెస్ట్లో ఓడిపోయే స్టేజ్ నుంచి మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఈ టెస్ట్లో 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినా.. పరుగుల ఖాతా తెరవకుండానే 2 వికెట్లు కోల్పోయినా.. భారత్ బెదరలేదు. 143 ఓవర్లు ఇంగ్లాండ్ బౌలర్లను కాచుకుని.. మ్యాచ్ను డ్రా చేసింది. దీంతో నాలుగు మ్యాచ్లు ముగిసే సరికి సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. కానీ చివరి మ్యాచ్లో భారత్ గెలిస్తే.. సిరీస్ 2-2తో సమం అవుతుంది.
ఓవర్ నైట్ స్కోరు 174/2తో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్.. తొలి సెషన్లోనే కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఇంగ్లాండ్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. చివరి రెండు సెషన్లలో ఆరు వికెట్లు తీసి.. మ్యాచ్లో గెలవొచ్చని ఆతిథ్య జట్టు భావించింది. కానీ వారి ఆశలను అడియాశలు చేశారు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్ . మొండిపట్టుదలతో బ్యాటింగ్ చేసి అనుకున్నది సాధించారు. అసలైన టెస్ట్ ఆటను ఇంగ్లాండ్కు రుచి చూపించారు.
రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ల దెబ్బకు ఇంగ్లాండ్ ప్లేయర్లు అలసిపోయారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వికెట్లు పడకపోవడంతో మ్యాచ్ను వదిలేశారు. ఇక ఈ మ్యాచ్లో గెలవలేమని మ్యాచ్ ముగియడానికి 15 ఓవర్ల ముందుగానే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డిసైడ్ అయిపోయాడు. ఫ్రస్టేషన్లో డ్రా ప్రతిపాదన చేశాడు. కానీ అప్పటికీ జడేజా, సుందర్ సెంచరీలకు చేరువయ్యారు. చివరకు రవీంద్ర జడేజా (107*), వాషింగ్టన్ సుందర్ (101*) సెంచరీలు కొట్టేశారు. ఆ తర్వాత భారత్, ఇంగ్లాండ్లు డ్రాకు అంగీకరించాయి. రెండో ఇన్నింగ్స్లో భారత్.. 143 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. ఇందులో శుభ్మన్ గిల్ 238 బంతులు, కేఎల్ రాహుల్ 230 బంతులు, వాషింగ్టన్ సుందర్ 206 బంతులు, జడేజా 185 బంతులు ఎదుర్కొన్నారు. ఇక నాలుగు మ్యాచ్లు ముగిసే సరికి సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన నిర్ణయాత్మక ఐదో టెస్ట్ జులై 31 నుంచి ఓవల్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సిరీస్ను 2-2తో సమం చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa