ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ మాస్టర్‌మైండ్‌ హతం

national |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 08:19 PM

ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ చర్చ ప్రారంభించిన సమయంలోనే.. జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలకు భారీ విజయం దక్కింది. పహల్గామ్‌లో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసా సహా ముగ్గురు ముష్కరులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భద్రతా బలగాలు సోమవారం ఉదయం ఈ ఆపరేషన్ చేపట్టాయి. లష్కరే తొయిబా ఉగ్రవాది సులేమాన్ షాను పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు భద్రతా వర్గాలు ధ్రువీకరించాయి. శ్రీనగర్ సమీపంలో దచిగామ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో సులేమాన్‌ను హతమార్చారు. సులేమాన్‌తో పాటు హతమైన ఇద్దరు ఉగ్రవాదులను అబూ హమ్‌జా, యాసిర్‌గా గుర్తించారు. ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్, జమ్మూ-కశ్మీర్ పోలీసు బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.


ఎవరీ సులేమాన్ అలియాస్ హసీమ్ మూసా ?


పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి అయిన సులేమాన్ షా.. పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసినట్టు గుర్తించారు. పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యేక దళాల్లో పారా కమాండర్‌గా శిక్షణ తీసుకున్న ఇతడి మరో పేరు హషీమ్ మూసా . పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం జమ్మూ-కశ్మీర్ పోలీసులు షా గురించి సమాచారం ఇస్తే రూ. 20 లక్షల బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. గతంలో కశ్మీర్‌లో జరిగిన మూడు కీలక ఉగ్రదాడుల్లో కూడా హషీమ్ మూసా సూత్రధారిగా ఉన్నాడని నిఘా వర్గాలు గుర్తించాయి. దాడి తర్వాత ఉగ్రవాదులు తప్పించుకున్న తీరు పరిశీలిస్తే వారికి అత్యున్నతస్థాయి శిక్షణ, నైపుణ్యాలు ఉన్నాయని భద్రతా బలగాలు అనుమానించాయి.


పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముష్కరులు అత్యాధునిక ఎం 4 రైఫిల్స్‌ను ఉపయోగించడంతో వారికి హషీమ్ మూసా శిక్షణ ఇచ్చినట్టు భావిస్తున్నారు. హషీమ్ మూసా ప్రస్తుతం లష్కరే ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తోన్న కరుడుగట్టిన ఉగ్రవాది. భారత్‌లోని భద్రతా బలగాలు, పౌరులపై దాడులకు లష్కరే తోయిబా అతడ్ని కశ్మీర్‌కు పంపించినట్టు పలు నివేదికలు బట్టబయలు చేశాయి. అతడి వ్యూహాత్మక ఆలోచనలు, ఆయుధ శిక్షణ అతడిని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మార్చాయి. పహల్గామ్ దాడికి పాకిస్థాన్ అగ్రనేతల నుంచి ఆదేశాలు అందినట్టు నిఘా నివేదికలు వెల్లడించాయి.


ఎన్‌కౌంటర్‌పై చినార్ కార్ప్ ప్రకటన


ఆర్మీకి చెందిన చినార్ కార్ప్ అధికారిక ఎక్స్ (ట్విటర్)లో ఎన్‌కౌంటర్‌ గురించి వెల్లడించింది. ‘‘లిడ్వాస్ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాం. భీకర కాల్పుల్లో ముగ్గుర్ని మట్టుబెట్టాం... ఆపరేషన్ కొనసాగుతోంది’’ అని తెలిపింది. ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులే కాగా.. అత్యంత ప్రాధాన్య గల టార్గెట్లుగా గుర్తించారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భద్రతా దళాలు హర్వాన్ ప్రాంతంలోని ముల్నార్ వద్ద ఆపరేషన్ ప్రారంభించాయి. అక్కడకు అదనపు బలగాలను తరలించి.. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.


అటవీ ప్రాంతంలోని ఉన్న ఉగ్రవాదుల స్థావరంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కార్బైన్ తుపాకులు, AK-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడికి ముష్కరులు కుట్రలు చేస్తున్నట్టు భద్రతా వర్గాల అనుమానిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa