జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనగర్ నగర శివార్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దచిగామ్ నేషనల్ పార్కు సమీపంలోని హర్వాన్ ప్రాంతంలో.. ముఖ్యంగా ముల్నార్ ఏరియాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం నుంచి హోరాహోరీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్కు "ఆపరేషన్ మహాదేవ్" అని పేరు పెట్టారు.
సమగ్ర నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలు యాంటీ-మిలిటెన్సీ ఆపరేషన్ను ప్రారంభించాయి. నిర్దిష్ట ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో.. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సుమారు ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. అంతేకాకుండా వీరు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులుగా భావిస్తున్నారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న లష్కరే తొయిబా ఉగ్రవాది సులేమాన్ షాను మట్టుబెట్టినట్టు సైనిక వర్గాలు తెలిపాయి.
ఎదురుకాల్పుల ధ్వనులు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయని, ఇది ఒక తీవ్రమైన ఆపరేషన్ అని అధికారులు తెలిపారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి లేదా మట్టుబెట్టడానికి బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి. శ్రీనగర్లో ఉన్న ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ తమ అధికారిక 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఈ ఎన్కౌంటర్ గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తోంది. మొత్తం ఆపరేషన్ పూర్తయిన తర్వాతే ఉగ్రవాదులను చంపారా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది.
జమ్ము కశ్మీర్లోని పహల్గాం బైసరన్ లోయలో ఏప్రిల్ 22వ తేదీ జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ముస్లిం కాని పురుషులనే లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులకు పాల్పడ్డారు. మొత్తంగా 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీశారు. అయితే ఇదంతా చేసింది నలుగురు ఉగ్రవాదులే కాగా.. భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. కానీ ఇప్పటి వరకు పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులు మాత్రం పట్టుబడలేదు. కానీ తాజాగా వారిపైనే భద్రతా బలగాలు కాల్పులు చేస్తున్నట్లు వస్తున్న వార్తలతో ప్రజలంతా తెగ సంబుర పడిపోతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోందనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa