అహ్మదాబాద్లో జూన్ 12వ తేదీన జరిగిన ఏఐ-171 విమాన ప్రమాదం అనేక మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఈ భయానక ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారిలో 30 ఏళ్ల మనీషా, ఆమె ఎనిమిది నెలల కుమారుడు ధ్యాంష్లు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరి కథ దేశ ప్రజలందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ముఖ్యంగా ఈ దుర్ఘటనలో ధ్యాంష్ శరీరం 36 శాతానికి పైగా కాలిపోయింది. అయితే తల్లి మనీషాకు 25 శాతం గాయాలు అయ్యాయి. అయినా అవేమీ పట్టించుకోని ఆమె.. తన ప్రాణాలకు తెగించి అగ్నికీలల నుంచి బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటంతో మంటల్లోంచి బయటకు పరుగులు తీసింది. ఆ నిస్వార్థ ప్రేమకు నిదర్శనంగానే బాబు రెండు సార్లు ప్రాణాలతో బయట పడి.. తల్లి ఒడిలో హాయిగా ఆడుకుంటున్నాడు.
బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పక్కనే ఉన్న ఇంట్లో మనీషా కుటుంబం నివసిస్తోంది. అయితే ప్రమాద సమయంలో కుమారుడు ధ్యాంష్తో పాటే ఆమె కూడా ఇంట్లోనే ఉంది. అయితే విమానం కుప్పకూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో చుట్టు పక్కల ఇళ్లన్నీ పొగతో నిండిపోయాయి. అయినా సరే మనీషా ఏమాత్రం భయపడలేదు. తన ఒళ్లంతా కాలిపోతున్నా పట్టించుకోకుండా తన బాబు ఎక్కడున్నాడో వెతికింది. అతడు కళ్లకు కనిపించిన వెంటనే తన చేతుల్లోకి తీసుకుని బయటకు పరుగు పెట్టడం ప్రారంభించింది. అప్పటికే బిడ్డకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.
అయినా అవేమీ పట్టించుకోకుండా తన బిడ్డను కాపాడాలన్న ధైర్యంతో మనీషా మంటల్లోంచి బయటకు వచ్చింది. విషయం గుర్తించిన రెస్క్యూ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు 25 శాతం ఆమె శరీరం కాలిందని, అలాగే బాబుకు 36 శాతం గాయాలు అయ్యాయని చెప్పారు. వెంటనే ఇద్దరినీ వేర్వేరు ఐసీయుల్లోకి తరలించి చికిత్స ఇవ్వడం ప్రారంభించారు. ఈక్రమంలోనే బాబు చర్మం మొత్తం కాలిపోగా.. అతడికి ఇతరుల చర్మం పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని వైద్యులు చెప్పారు. ఈ చికిత్స చేయకోపోతే బిడ్డ ప్రాణానికే ప్రమాదం అన్నారు. ఈ విషయం తెలుసుకున్న మనీషా వెంటనే తన చర్మాన్నే బాబుకు పెట్టమని చెప్పింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులు సైతం మనీషా చర్మాన్ని తీసుకుని బాబుకు అంటుకట్టు విధానం ద్వారా అతికించారు.
ఇలా దాదాపు ఐదు వారాలుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న వీరిద్దరూ ఎట్టకేలకు విడుదల అయ్యారు. విడుదల అయిన తర్వాతే మనీషా మీడియాతో మాట్లాడుతూ.. తన బిడ్డను ఎలా కాపాడుకోగల్గిందో చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త ప్రతీ ఒక్కరి హృదయాలను తాకుతోంది. ఓ యుద్ధంలో పోరాడిన సైనికురాలిలా ప్రాణాలకు తెగించి మరీ ఆమె తన కుమారుడిని కాపాడుకోవడం చూసిన ప్రతీ ఒక్కరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. పెద్ద ఎత్తున మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa