ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో చిల్లీ చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం

national |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 09:35 PM

మీరు ఎప్పుడైనా చిల్లీ చికెన్ తిన్నారా.. ఎంత బాగుంటుందో అంటారా.. కానీ, మీరేప్పుడైనా గబ్బిలాలతో తయారు చేసిన చిల్లీ చికెన్ తిన్నారా.. గబ్బిలాలతో తయారు చేసిన చిల్లీ చికెన్‌ను అమ్ముతున్న ఓ దారుణమైన సంఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని డానిష్‌పేట అటవీ ప్రాంతంలో గబ్బిలాలను చంపి ఆ తర్వాత వాటిని వండి చిల్లీ చికెన్‌గా అమ్ముతున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పాపం ఇది నిజమైన చికెన్ అనుకుని అక్కడి స్థానిక ప్రజలు తింటున్నారని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.


డానిష్ పేట పరిధిలోని తోప్పూర్ రామస్వామి కొండ ప్రాంతంలో తరచుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని డానిష్‌పేట అటవీ కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో ఫారెస్ట్ రేంజర్ విమల్‌కుమార్ నేతృత్వంలోని అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు.. నిజంగానే అక్కడ తుపాకీ కాల్పుల శబ్దాలు వారికి వినిపించాయి. దీంతో ఏంటని వారు అటవీ ప్రాంతాన్ని మొత్తం గాలించారు. ఈ క్రమంలోనే వారికి కమల్, సెల్వం అనే ఇద్దరు వ్యక్తులు కన్పించారు.


వెంటనే అటవీ శాఖ అధికారులు వారి ఇద్దరిని పట్టుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించగా.. వారు ఎలాంటి విషయాలు చెప్పలేదు. కాకపోతే వారిద్దరూ ఓ హోటల్ నిర్వహిస్తూ చికెన్ అమ్ముతున్నారు. దీంతో వారు గబ్బిలాల మాంసంతోనే చికెన్ చేస్తున్నట్లు అనుమానించిన స్థానికులు అదే నిజమై ఉంటుందని పోలీసులకు చెప్పారు. ఇలా పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.


అయితే ప్రస్తుతం వారు నోరు మెదపడం లేదని.. తాము ఎలాంటి తప్పు చేయడం లేదని మాత్రమే చెబుతున్నారని పోలీసులు వివరించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయని అంటున్నారు. మరోవైపు ఓమలూరు సమీపంలోని పన్నపట్టి పంచాయతీలోని వవ్వాల్‌తోప్పు ప్రాంతంలో ఒక చెట్టుపై లక్షలాది గబ్బిలాలు నివసిస్తున్నాయని.. వాటిని వేటాడటానికి కూడా వీరిద్దరూ ప్రయత్నించినట్లు ఆ గ్రామస్థులు చెబుతున్నారు. కానీ తాము గబ్బిలాలను దేవతలుగా పూజిస్తున్నందున వాటిని చంపడానికి అనుమతించలేదని.. అందుకే వారు అడవుల్లోకి వేటకు వెళ్లి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


గబ్బిలాలతో చిల్లీ చికెన్ అనే పదం ఇప్పుడు రాష్ట్రమే కాదు.. దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. గబ్బిలాలతో డేంజరస్ వైరస్‌లు సోకుతాయని వైద్యులు చెబుతుంటారు. కానీ వీరు ఏకంగా ఈ గబ్బిలాలతోనే ఇలాంటి చిల్లీ చికెన్ లాంటి వంటకాలు తయారు చేయడంపై సర్వంత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై లోతుగా విచారణ జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa