ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ మా మిత్ర దేశమే.. అయినా అదనపు సుంకాలు తప్పవు..: ట్రంప్

international |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 09:26 PM

అమెరికా-భారత్ దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదని స్పష్టం చేస్తూనే.. భారత ఉత్పత్తులపై 20 నుంచి 25 శాతం సుంకాలను విధించే అవకాశం ఉందని పరోక్షంగా సూచించారు. భారత్ తమకు మంచి మిత్ర దేశమే అయినప్పటికీ.. సంవత్సరాలుగా అమెరికా వస్తువులపై అధిక సుంకాలను విధిస్తోందని అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి తాను కట్టుబడి ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు.


ముఖ్యంగా 20 నుంచి 25 శాతం సుంకాలను భారత్ చెల్లించనుందా అని మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ప్రశ్నించగా.. అవునని సమాధానం చెప్పారు. తాను అలాగే అనుకుంటున్నట్లు వివరించారు. భారత్‌తో ఇంకా వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని.. తన అభ్యర్థన మేరకు ఇండియా, పాక్‌లు యుద్ధాన్ని ముగించాయన్నారు. భారత్ తమకు మంచి మిత్ర దేశమే అయిప్పటికీ.. గత కొన్నేళ్లుగా అన్ని దేశాల కంటే ఎక్కువగా సుంకాలను విధిస్తోందన్నారు. కానీ ఇప్పుడు తాను బాధ్యత వహిస్తున్నానని.. మీలు అలా చేయలేరని చెప్పారు. వాణిజ్య ఒప్పందాలు చాలా బాగా పని చేస్తున్నాయని భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.


  ఏప్రిల్ 2వ తేదీన ట్రంప్ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం అందిరకీ తెలిసిందే. అయితే వాణిజ్య ఒప్పందాల కోసం 90 రోజుల పాటు ఈ సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ వ్యవధిలో 10 శాతం సుంకం అమలులో ఉండగా.. ఆగస్టు 1వ తేదీ వరకు దీనిని పొడిగించారు. వాణిజ్య చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆగస్టు 25న అమెరికా ప్రతినిధి బృందం భారత్‌ను సందర్శించనుంది. ఈ చర్చల ద్వారా భారత్ తన మార్కెట్లను అమెరికన్ ఎగుమతులకు ఎంతవరకు తెరిచేందుకు సిద్ధంగా ఉందో అంచనా వేయాలని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ పేర్కొన్నారు.


భారత్ కూడా అమెరికా విధించిన అదనపు 26 శాతం సుంకాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఉక్కు, అల్యూమినియం (50 శాతం), ఆటోమొబైల్ రంగం (25 శాతం)పై విధించిన సుంకాల్లో రాయితీలను కోరుతోంది. ఇరు దేశాల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఇరు దేశాల ఆర్థిక సంబంధాలకు అత్యంత కీలకం కానున్నాయి. ఇలాంటి సమయంలోనే ట్రంప్ ఈ రకంగా వ్యాఖ్యానించడం అందరినీలోనూ అనుమానాలకు తావిస్తోంది.


ముఖ్యంగా వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు అర్థం అవుతోంది. ఏది ఏమైనా చివరికి ఇరు పక్షాలకు ప్రయోజనకరమైన ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. ప్రపంచ వాణిజ్య పటంలో కీలక స్థానాల్లో ఉన్న ఈ రెండు దేశాల మధ్య కుదిరే ఏ ఒప్పందమైనా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలు.. ఆగస్టులో జరగబోయే సమావేశం వాణిజ్య సంబంధాలకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నాయని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa