ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ముఖ్య గమనిక. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నమోదు గడువు త్వరలోనే ముగియనుంది. ఆగస్ట్ 15వ తేదీతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నమోదు గడువు ముగుస్తుందని.. రైతులకు ఈ విషయాన్ని గమనించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అతివృష్టి, ఆనావృష్టి వంటి ప్రకృతి విపత్తులతో పాటుగా పంటలకు చీడపీడలు వంటివి వచ్చిన సమయంలో రైతన్నలు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేస్తోంది. పంటల బీమాకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), పునర్నిర్మించిన వాతావరణ పంటల బీమా అనే రెండు పథకాలను కేంద్రం అమలు చేస్తోంది.
అయితే వీటిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఆగస్ట్ 15వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రైతులు త్వరగా బీమా ప్రీమియం చెల్లించి ఈ పథకం ప్రయోజనాలు అందుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. పంటను అనుసరించి బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించిన రైతులకు.. పంట నష్టం సంభవిస్తే ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించి వారిని ఆదుకుంటారు. తుపానులు, అగ్నిప్రమాదాలు, వడగండ్ల వానలు, ఈదురు గాలులు, వరద ముంపు, చీడపీడలు వంటివి సంభవించినప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. పంట నష్టం సంభవించిన రెండురోజుల్లోగా రైతులు సంబంధిత బ్యాంక్ అధికారులకు, బీమా కంపెనీకి, వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించి ప్రయోజనం పొందవచ్చు.
మరోవైపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియంను రైతులు రైతు సేవా కేంద్రాలలో చెల్లించవచ్చు. ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, పంట ధ్రువీకరణ పత్రం తీసుకుని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి బీమా ప్రీమియం చెల్లించి నమోదు చేయించుకోవాలి. కౌలుదారులు అయితే అదనంగా ప్రభుత్వం ఇచ్చిన కౌలుకార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. బీమా ప్రీమియం గడువు ఆగస్ట్ 15తో ముగుస్తుందని.. పంట వేసిన ప్రతి రైతు కూడా ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లించి తమ పంటలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa